corporation office: బీటలువారి.. పెచ్చులూడి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:35 PM
Building Dilapidated condition శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

శిథిలావస్థలో శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం
సీలింగ్ పరిస్థితి అంతే సంగతులు
బిక్కుబిక్కుమంటూ అధికారులు, సిబ్బంది విధులు
శ్రీకాకుళం అర్బన్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ఏ గది చూసినా గోడలు బీటలు వారి, శ్లాబులు పెచ్చులూడి దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏ క్షణాన ఆ పెచ్చులూడి తమపై పడతాయోనని సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. 1856లో మునిసిపాలిటీగా ఏర్పడిన శ్రీకాకుళం.. 2015 డిసెంబర్ 9న నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందింది. సుమారు 169 ఏళ్ల చరిత్ర కలిగిన కార్పొరేషన్ భవనానికి అధికారులు పలుమార్లు మరమ్మతులు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. అయినప్పటికీ నిర్మాణ పనుల్లో లోపాలతో గోడలు బీటలు వారుతున్నాయి. కార్యాలయంలోని రికార్డు రూమ్లో శ్లాబ్ పెచ్చులూడాయి. మేనేజర్ రూమ్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సమావేశ మందిరంలో ఇటీవల వేసిన సీలింగ్కి కన్నాలు పడగా.. ఎప్పుడు పడిపోతుందో తెలియని దుస్థితి నెలకొంది. కార్యాలయం బయట పై అంతస్తు గోడకు పెచ్చులూడిపోగా, పిచ్చి మొక్కలు వెలిశాయి. మార్చి 31 నాటికి రూ.26కోట్ల పన్ను బకాయిలు వసూళు చేసిన కార్పొరేషన్ అధికారులు.. ఈ కార్యాలయం మరమ్మతులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం శిఽథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. ప్రైవేట్ పార్టనర్ షిప్(పి.పి.పి) విధానంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కింద భవనంలో కమర్షియల్ కాంప్లెక్స్, మీద భవనంలో నగరపాలక కార్యాలయం నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతాం. కార్యాలయంలో బీటలు బారిన శ్లాబ్కు మరమ్మత్తులు చేయిస్తాం.
- పీవీవీ ప్రసాదరావు, నగర పాలక సంస్థ కమిషనర్, శ్రీకాకుళం