Hyderabad: పిల్లలను చంపుకునేంత కష్టం ఏమొచ్చింది..
ABN , Publish Date - Mar 12 , 2025 | 08:52 AM
కని పెంచుకుంటున్న పిల్లలను చంపేసి, తాము ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం పిల్లలను చంపి చంద్రశేఖర్రెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే.

- అప్పుల బాధతోనే ఆత్మహత్యలా..?
- పిల్లలను ఎలా చంపారనే కోణంలో పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్: కన్న పేగునే తెంచుకునేంత కష్టం ఆ తల్లిదండ్రులకు ఏమొచ్చిందో..? ఆత్మహత్యలకు అప్పుల బాధలే కారణమా..? ఇతర కారణలేమైనా ఉన్నాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు పిల్లల్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్రెడ్డి(Chandrasekhar Reddy) దంపతుల ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా కల్వకుర్తి సమీపంలోని ముక్కురాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలితో కలిసి నగరంలోని హబ్సీగూడలో ఉంటున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ధూల్పేట గంజాయి లేడీడాన్.. అంగూరుబాయ్పై పీడీ యాక్టు
సోమవారం పిల్లలను చంపి చంద్రశేఖర్రెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. భార్యా భర్తల మృతదేహాల వద్ద వేరువేరుగా సూసైడ్ నోట్లు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులను భరించలేకే మొదట పిల్లలకు విషమిచ్చి, ఉరేసి, ఆ తరువాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని తెలిసింది. ఘటన సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులను విచారించినా అప్పుల విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఓయూ పోలీసులు తెలిపారు. పిల్లల్ని ఏ విధంగా చంపారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
చంద్రశేఖర్ది పెద్ద కుటుంబం
చంద్రశేఖర్రెడ్డికి ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఒక్కొక్కరికి సుమారు 15 ఎకరాల వరకు భూమి ఉందని, సోదరులు అతనికి సహాయంగా ఉండేవాళ్లని తెలిసింది. కేవలం అప్పుల బాధతోనే పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా అని అతని సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్లాంటి వాటిలో పెద్దమొత్తం పోగొట్టుకున్నాడేమోననే అనుమానాలు వినిపిస్తున్నాయి.
అమ్మా, నాన్న నన్ను క్షమించండి..
‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను తీసుకున్న నిర్ణయం మీరు భరించలేనిది. కానీ, నేను మీకు భారం కావొద్దని ఈ నిర్ణయం తీసుకుంటున్నా. కొన్ని రోజులు బాధ ఉంటుంది.. తరువాత మరిచిపోయి అందరితో కలిసి మంచిగా ఉండండి. అమ్మా, నాన్నని జాగ్రత్తగా చూసుకోండి..’ అంటూ మృతురాలు కవిత రాసిన సూసైడ్ నోట్లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
లంచాలు మరిగి.. వలకు దొరికి.. !
అమెరికాలోనే పేపాల్ డాటా లీకేజీ!
ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోలు
Read Latest Telangana News and National News