Share News

Delhi Election Results: ఇదీ మోదీ దెబ్బ.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. ఫిక్స్ చేసి మరీ కొట్టారుగా.

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:42 PM

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి ఓటమి చెందారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్‌ స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది.

Delhi Election Results: ఇదీ మోదీ దెబ్బ.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. ఫిక్స్ చేసి మరీ కొట్టారుగా.
Arvind Kejriwal

ఆమ్ ఆద్మీ పేరుతో నేనో సామాన్యుడిని.. మీలో ఒకడినంటూ రాజకీయాల్లోకి వచ్చి.. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి.. ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ మరో సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. ఢిల్లీ సీఎంగా ఉంటూ.. జాతీయ రాజకీయాల్లో మోదీని నిలువరించే నాయకుడిని తానేనంటూ దేశ వ్యాప్తంగా ఆప్‌ను విస్తరించే పనిలో పడ్డారు. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్‌ను అధికారంలోకి తీసుకొచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌ను కాదని, తనకు మద్దుతు ఇచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్నారు. చివరికి మోదీ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. న్యూఢిల్లీ శాసనసభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్.. నాలుగోసారి అదే నియోజవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తన ప్రత్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్‌పై స్వల్ప తేడాతో ఓటమి చెందారు. తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బగా చూడాల్సి ఉంటుంది. తనను చూసి మిగిలిన 69 మంది ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసిన కేజ్రీవాల్.. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం బిగ్ షాక్‌గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఢిల్లీలో అధికారంలోకి రావడంతో పాటు కేజ్రీవాల్‌ను ఓడించాలని మోదీ టార్గెట్‌గా పెట్టుకున్నారు. బయటకు చెప్పకపోయినప్పటికీ కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించాలని టార్గెట్ ఫిక్స్ చేసి మరీ కేజ్రీవాల్‌ను ఓడించారనే ప్రచారం జరుగుతోంది.


మోదీని టార్గెట్ చేయడంతో..

కేజ్రీవాల్ దేశ వ్యాప్తంగా తన పార్టీని విస్తరించే పనిలో మోదీని టార్గెట్ చేశారు. పరుష పదజాలంతో కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు.. ముఖ్యంగా మోదీపై పదునైనా విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ పరిస్ధితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉండటంతో ఢిల్లీలో ఈసారి గెలిస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు. కాంగ్రెస్‌ లేకుండా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిపి ఓ కూటమిని ఏర్పాటుచేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను ఎమ్మెల్యేగా తన సొంత నియోజవకర్గంలో ఓడించాలనే లక్ష్యంతో పర్వేష్‌ను రంగంలోకి దింపారు. మోదీ తన లక్ష్యసాధనలో సక్సెస్ అయినట్లు ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే అర్థమవుతోంది.


పోస్టల్ బ్యాలెట్ మొదలు..

విద్యావంతులు, ఉద్యోగులు ఓట్లు వేసే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ కేజ్రీవాల్ వెనుకబడ్డారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపులో రెండు, మూడు రౌండ్లు స్వల్ప మెజార్టీ కనబర్చినప్పటికీ రెండు నుంచి మూడు వందలకు మించి అధిక్యం కనబర్చలేదు. మొత్తం 13 రౌండ్లకు గానూ మొదటి రౌండ్‌లో కేజ్రీవాల్‌పై పర్వేశ్ 74 ఓట్ల మెజార్టీ సాధించారు. రెండో రౌండ్‌లో కేజ్రీవాల్ 328 ఓట్లు ఎక్కువ సాధించారు. దీంతో కేజ్రీవాల్ స్వల్ప అధిక్యాన్ని కనబర్చారు. మూడో రౌండ్‌లో కేజ్రీవాల్ దాదాపు 90 ఓట్లు పర్వేష్‌పై ఎక్కువుగా సాధించారు. ఆ తర్వాత నాల్గవ రౌండ్ పర్వేష్ అధిక్యం సాధించగా.. ఐదో రౌండ్‌లో కేజ్రీవాల్ అధిక్యాన్ని సాధించారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో రౌండ్‌లో పర్వేష్ అధిక్యాన్ని సాధించారు. దీంతో పది రౌండ్లు ముగిసే సమయానికి పర్వేష్ .. కేజ్రీవాల్‌పై 1844 ఓట్ల అధిక్యాన్ని కనబర్చారు. మిగిలిన మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత పర్వేష్ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 08 , 2025 | 12:42 PM