Operation Brahma: మయాన్మార్కు ఆపన్న హస్తం.. 50 టన్నుల సహాయక సామగ్రిని అందజేసిన భారత్
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:03 PM
భూకంపంతో అతలాకుతలమైన మయాన్మార్ను ఆదుకునేందుకు భారత్ తలపెట్టిన ఆపరేషన్ బ్రహ్మ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా 50 టన్నుల సహాయకసామగ్రితో కూడిన నావికాదళ నౌకలు యాంగూన్కు చేరుకున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

భూకంపంతో అతలాకుతలమైన మయాన్మార్ను ఆదుకునేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించిన భారత ప్రభుత్వం తాజా మరో 50 టన్నుల సహాయక సామగ్రిని అందించింది. వివిధ రకాల సహాయక సామగ్రితో భారత నావికాదళానికి చెందిన సత్పుర, సావిత్రి నౌకలు యాంగూన్కు చేరుకున్నాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎయిర్ఫోర్సుకు చెందిన ఎమ్సీసీ విమానాలతో పాటు నేవీకి చెందిన ఐదు నౌకల ద్వారా భారత్ ఆపరేషన్ బ్రహ్మ చేపడుతున్నట్టు యాంగూన్లోని భారత ఎంబసీ కూడా పేర్కొంది. భూకంపంతో ప్రభావితమైన యాంగూన్తో పాటు నేపీదా, మాండలేకు ఈ సామగ్రిని చేరుస్తున్నట్టు పేర్కొంది.
Also Read: పంజాబ్కు చెందిన మత ప్రబోధకుడికి యావజ్జీవ కారాగార శిక్ష
రెక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత కలిగిన భూకంపంతో మయాన్మార్తో పాటు పొరుగున ఉన్న దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. మయాన్మార్లో ఈ ప్రకృతి విపత్తు బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూకంపం గురించి తెలియగానే మొట్టమొదటగా స్పందించిన భారత్..సహాయకసామగ్రి తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించింది.
ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా ఇప్పటివరకూ భారత్ రెస్క్యూ బృందాలు, వైద్య బృందాలు, తాగు నీరు, టెంట్లు, ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులను పలు విడతల్లో ఎయిర్ఫోర్సో, నేవి ద్వారా పంపించింది. మార్చి 29న ఎయిర్ఫోర్సుకు చెందిన విమానం 15 టన్నుల సహాయక సామగ్రిని యాంగూన్కు చేర్చింది.
Also Read: మధ్యప్రదేశ్లో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న నగరాల్లో మధ్య నిషేధం
కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా భారత్ పలు దేశాల ఔషధ అసరాలు తీర్చేందుకు ముందుకొచ్చింది. వ్యాక్సీన్ మైత్రి పేరిట సుమారు 90 దేశాలు ఔషధాలు సరఫరా చేసింది. ఆపరేషన్ సంజీవని పేరిట మాల్దీవులకు అత్యవసర ఔషధాలను అందజేసింది. రెండేళ్ల క్రితం టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసినప్పుడు భారత్ ఆపరేషణ్ దోస్తు పేరిట ఆపన్న హస్తం అందించి తన మానవతాదృక్పథాన్ని చాటుకుంది.