Mamata Banerjee: వక్ఫ్ చట్టం అమలు చేయం... అల్లర్లకు దిగొద్దు: మమతా బెనర్జీ
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:00 PM
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా కేంద్రమేనని మమత అన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేవారెవరైనా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

కోల్కతా: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన వక్ఫ్ చట్టాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి ఆందోళనలు, అల్లర్లకు పాల్పడవద్దని, అల్లర్లను ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణణ చట్టానికి (Waqf Act) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో శుక్రవారం హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడంతో సామాజిక మాధ్యమం "ఎక్స్''లో రాష్ట్ర ప్రజలకు మమత తాజా సందేశం ఇచ్చారు.
Supreme Court: బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి 3 నెలలు గడువు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
''వక్ఫ్ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఈ చట్టానికి మేము మద్దతీయడం లేదు. మన రాష్ట్రంలో ఈ చట్టం అమలు కాదు. ఇంక అల్లర్లు దేనికోసం?" అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అన్ని మతాల ప్రజలు ప్రశాంతంగా, సంయమనంతో ఉండాలని ఆమె కోరారు. మతం పేరుతో ఎలాంటి అనుచిత పనులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క ప్రాణం విలువైనదేనని, రాజకీయాల కోసం అల్లర్లను ప్రోత్సహించవద్దని, అల్లర్లు సృష్టించే వాళ్లు సమాజానికి హాని చేస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా కేంద్రమేనని మమత అన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేవారెవరైనా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వారి వలలో పడవద్దని కోరారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసేది లేదని, తీర్పును ఉల్లంఘించినందుకు జైలుకు తనను పంపవచ్చని, అయినా వెనక్కి తగ్గది లేదని మమతా బెనర్జీ ఇటీవల స్పష్టం చేశారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్లో శుక్రవారం జరిగిన నిరసనలు కట్టుతప్పాయి. ఆందోళనకారులు మూడు గంటలసేపు విధ్వంసకాండకు దిగారు. పొలీసులు అక్కడకు చేరుకునే లోపే పలు దుకాణాలను లూటీ చేశారు. కొన్నింటిని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు.
ఇవి కూడా చదవండి..