‘స్వచ్చసర్వేక్షణ్’లో అగ్రస్థానంలో నిలవాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:07 AM
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే దేశవ్యాప్త స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో కరీంనగర్ నగరపాలక సంస్థ ఫస్ట్ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశమందిరంలో మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, శానిటేషన్ జవాన్లతో స్వచ్ఛ సర్వేక్షణ్పై సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.

కరీంనగర్ టౌన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిర్వహించే దేశవ్యాప్త స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో కరీంనగర్ నగరపాలక సంస్థ ఫస్ట్ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశమందిరంలో మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, శానిటేషన్ జవాన్లతో స్వచ్ఛ సర్వేక్షణ్పై సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు డివిజన్లలో ప్రతి ఇంటిని సందర్శించి స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లో నగరవాసులతో ఫీడ్బ్యాక్ చేయిస్తూ తడి, పొడిచెత్త వేర్వేరు సేకరణ ప్రక్రియపై అవగాహన కల్పించాలని అన్నారు. స్వచ్ఛ ఆటోల్లో చెత్త వేరు చేసి డీఆర్సీసీ సెంటర్, ఆర్ఆర్ఆర్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. వీలైనంత వరకు డంపుయార్డుకు చెత్త వెల్లకుండా చూడాలన్నారు. ప్రతి ఆర్ఆర్ఆర్, డీఆర్సీసీ సెంటర్లలో లాగ్బుక్ పాటించి వచ్చే మెటీరియల్ వివరాలను పొందుపరచాలని కమిషనర్ ఆదేశించారు. మంగళవారం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ ప్రారంభమవుతున్నందున నిబంధనల మేరకు కార్యక్రమాలను నిర్వహించాలని, దీనిపై జవాన్లు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటో, రిక్షా వెళ్లి చెత్తను సేకరించాలని ఆదేశించారు. నగరంలో రోడ్లను ప్రతిరోజూ శుభ్రం చేయాలని, లిట్టర్ బిన్స్, డంపర్ బిన్స్ ఏర్పాటు చేసిన చోట పరిశుభ్రతను పాటించాలని అన్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం రోడ్లను శుభ్రం చేయాలని, ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని జవాన్లను ఆదేశించారు. ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని, మూడు నెలల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కొనసాగుతుందని, పరిశుభ్రత విషయంలో జవాన్లు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈనెల 21న ఏర్పాటు చేసిన బల్క్ వేస్టు ఎక్స్పో సమావేశానికి హోటల్స్ రెస్టారెంట్స్ నిర్వహకులు పాల్గొనేలా చూడాలని అన్నారు. నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములై నగర స్వచ్ఛతకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి పాల్గొన్నారు.