Share News

సాగుకు సహాయం అందిస్తాం

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:09 PM

జిల్లాలో వ్యవసాయ రంగంలో పంట సాగుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని సుందిళ్ల బ్యారేజీ శివ్వారం గ్రామ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనరాయణలతో కలిసి పర్యటించారు.

సాగుకు సహాయం అందిస్తాం
శివ్వారంలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ రంగంలో పంట సాగుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని సుందిళ్ల బ్యారేజీ శివ్వారం గ్రామ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనరాయణలతో కలిసి పర్యటించారు. రైతులతో వ్యవసాయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంటసాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం, ఇతర నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము, ఆస్తి పన్నుల వసూలు అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఆస్తి పన్నులను వంద శాతం వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఎస్‌ఐ నాగరాజు, ఎంపీవో బాలయ్య, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

భీమారం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. బుధవారం మండలంలోని దాంపూర్‌ గ్రామంలో పర్యటించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రణాళిక బద్దంగా నిరంతరం తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్‌ బన్సీలాల్‌, ఎంపీడీవో మధుసూదన్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

చివరి ఆయకట్టుకు సాగునీరందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌,(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రాజెక్టుల కింద సాగు చేయబడే చివరి ఆయకట్టు వరకు పంటల సాగుకు నీరందించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 11.4 టీఎంసీ ఉందని, కార్యాచరణ ప్రకారం నీటిని విడుదల చేస్తామన్నారు. సుందిల్ల, అన్నారం, గూడెం ఎత్తిపోతలు, ఇతర మధ్య,చిన్న తరహా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, నీల్వాయి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జూన్‌ 15 వరకు జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో సాగునీరు, తాగునీరుఉ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:09 PM