Medak: కౌడిపల్లి వసతి గృహంలో ఫుడ్ పాయిజన్
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:17 AM
మెదక్ జిల్లా కౌడిపల్లి సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అన్వస్థతకు లోనయ్యారు.

30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కౌడిపల్లి, ఏప్రిల్ (ఆంధ్రజ్యోతి) 13: మెదక్ జిల్లా కౌడిపల్లి సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అన్వస్థతకు లోనయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. పదో తరగతి పరీక్షలు అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం హాస్టల్లో 97 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరికి ఆదివారం అల్పాహారంగా ఇడ్లీని అందించారు. ఇడ్లీలు తిన్న తర్వాత దాదాపు 30 మంది విద్యార్థినులకు వాంతులు, కడుపు నొప్పి మొదలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
ప్రస్తుతం విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారు. మరోవైపు, విద్యార్థులు ఇడ్లీల్లో వెంట్రుకలు, పురుగులు వస్తున్నాయని తెలిపారు. హాస్టల్లో ఆహారం సరిగ్గా లేకపోవడంతో చాలా మందిమి బయట నుంచి తీసుకువచ్చిన భోజనం చేస్తున్నామని చెప్పారు. ఆహారం బాగాలేదని ఫిర్యాదు చేస్తే 500 గుంజీలు తీయిస్తున్నారని విలపించారు. రోజూ సకాలంలో భోజనం అందించకపోవడంతో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇదే విషయంపై హాస్టల్ వార్డెన్ నర్సమ్మను వివరణ కోరగా ఆమె నోరు మెదపలేదు.