డాక్టర్ ఆదినారాయణ రావు: నడక నేర్పిన వైద్యుడు
ABN , First Publish Date - 2022-01-26T08:46:35+05:30 IST
ప్రసిద్ధ ఆర్థోపెడిక్ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు(83) ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన 3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 989

విశాఖపట్నం, భీమవరం, జనవరి 25: ప్రసిద్ధ ఆర్థోపెడిక్ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు(83) ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన 3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 989 శిబిరాలు నిర్వహించారు. పోలియో ఆపరేషన్లతోపాటు ఇతర చికిత్సలు అందించేందుకు విశాఖలో ప్రేమ ఆస్పత్రిని నెలకొల్పారు. ఇక్కడకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది వచ్చి చికిత్స పొందేవారు. దేశంలోనే ఎముకల వైద్యంలో ఆయన ప్రఖ్యాతి పొందారు. పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట దేవుడిగా మారారు. పేదలకు ఉచిత వైద్య సేవలందించే డాక్టరుగా గుర్తింపు పొందారు. 1939 జూన్ 30న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు ఆయన జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులు. నలుగురు కుమారుల్లో ఆయన మూడో సంతానం.
తండ్రి న్యాయవాది కూడా. భీమవరం సర్పంచ్గానూ పనిచేశారు. భీమవరంలో పాఠశాల విద్య, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఆర్థోపెడిక్ సర్జరీలో ఎంఎ్స(ఆర్థోపెడిక్స్) పూర్తి చేశారు. జర్మనీ వెళ్లి. మైక్రోవస్కులర్, హ్యాండ్ సర్జరీ అంశాలలో శిక్షణ పొందారు. తిరిగి వచ్చాక విశాఖలోనే వైద్య సేవలు ప్రారంభించారు. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా పనిచేశారు. విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ సర్జన్గా పనిచేశారు. రాణీ చంద్రమణి దేవి హాస్పిటల్లో రిహాబిలిటేషన్ సెంటర్కు సూపరింటెండెంట్గా పనిచేశారు. క్రీడలలో ఆసక్తితో వ్యక్తిగత విభాగాలలో విజేతగా నిలిచేవారు. ఆయన సతీమణి ఆర్.శశిప్రభను కూడా వైద్యురాలే. ఆయన 1988లో ప్రధానమంత్రి జాతీయ అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, మహావీర్ ఫౌండేషన్ జాతీయ అవార్డు, ‘నేషనల్ అవార్డు ఫర్ చైల్డ్ వెల్ఫేర్-2013’, 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశ, విదేశాల్లోనూ ఖ్యాతి పొందారు. ప్రస్తుతం ఆయన విశాఖలో ప్రీ పోలియో సర్జికల్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా, ప్రేమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ జనరల్గా సేవలందిస్తున్నారు.