Share News

క్యాంటీన్ల కోలాహలం

ABN , Publish Date - Aug 17 , 2024 | 02:57 AM

పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపిన అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున పేదలు, కూలీలు, భవన కార్మికులు బారులు తీరడంతో క్యాంటీన్ల పరిసరాలు కోలాహలంతో నిండిపోయాయి.

క్యాంటీన్ల కోలాహలం
Anna canteens ap nara lokesh

పేదలు, కూలీలు, కార్మికుల

కళ్లలో తిరిగొచ్చిన తృప్తి

99 అన్న క్యాంటీన్లు ప్రారంభం

క్యాంటీన్ల కోలాహలం

పేదలు, కూలీలు, భవన కార్మికుల కళ్లలో తిరిగొచ్చిన తృప్తి.. రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపిన అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున పేదలు, కూలీలు, భవన కార్మికులు బారులు తీరడంతో క్యాంటీన్ల పరిసరాలు కోలాహలంతో నిండిపోయాయి. ఐదేళ్లుగా మూతపడ్డ రూ.ఐదు క్యాంటీన్లను ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తిరిగి తెరవడంతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి వడ్డించారు. భోజనాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి.. క్యాంటీన్‌లో అల్పాహారం, భోజనంపై ఆరా తీయడం కనిపించింది. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీల పరిధిలో 99 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఏర్పాటుచేసిన నాలుగు అన్న క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి మంత్రి డీఎ్‌సబీవీ స్వామి ప్రారంభించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 14 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. విజయవాడ నగరంలో 11 అన్న క్యాంటీన్లను ప్రారంభించగా, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఒకొక్కటి చొప్పున ప్రారంభించారు. గుంటూరు నగరం పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి పాతబస్టాండు సెంటర్లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. ఆహార పదార్ధాలను రుచి చూశారు. ఇంకా.. పల్నాడు బస్టాండు, చుట్టుగుంట రైతు బజార్‌ సెంటర్‌, మిర్చి యార్డుల్లో ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్‌ సర్కిల్‌, నల్లచెరువుల్లో ఎమ్మెల్యే నసీర్‌, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో 5 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అన్న ఎన్టీఆర్‌, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో..

శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు రెండు అన్నక్యాంటీన్లు, పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఒక క్యాంటీన్‌ను ప్రారంభించారు. నూజివీడు సహా ఏలూరు జిల్లావ్యాప్తంగా ఐదు అన్న క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను కేంద్రమాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు...ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు మంత్రి కొండపల్లి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. నెల్లూరు జిల్లా కావలిలో అన్న క్యాంటీన్‌ నిర్వహణకు ‘అభయం’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ రూ.లక్ష విరాళం చెక్కును స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి అందజేశారు. ఇదే జిల్లా కందుకూరులో టీడీపీ నాయకులు రూ.2.3 లక్షల విలువైన విరాళాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అన్న క్యాంటీన్ల నిర్వహణకు శ్రీసరస్వతి విద్యాసంస్థల యజమాని ఏవీ రమణారెడ్డి రూ.లక్ష విరాళం అందించారు.

తినేసి తిరిగి పనిలోకి వెళ్లా...

‘‘కడుపు నిండా భోజనం చేయగలిగితే మాలాంటి కుటుంబాలు ఏ పనికైనా వెళ్లి కష్టపడతాం. ఉపాధి కోసం పల్లెప్రాంతాల నుంచి నగరం కోసం వస్తుంటాం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాంటీన్‌లో రూ.5తో మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పనిలోకి వెళ్లగలిగాను. ఆర్థికంగా పెద్దభారం తప్పింది’’.

-బొంతు రాములు, యాతపేట, శ్రీకాకుళం

కూలి డబ్బు ఇంటి దగ్గర ఇచ్చా...

‘‘కూలి పనికి వెళ్లి తెచ్చుకునే డబ్బుల్లో సగానికి పైగా టిఫిన్‌, భోజనానికే సరిపోయేవి. ఇంట్లో ఇవ్వడానికి పెద్దగా డబ్బులు మిగిలేవి కావు. ఈ రోజు అన్న క్యాంటీన్‌లో తిన్నాను. ఉదయం, మధ్యాహ్నం రూ. పది ఇచ్చి అక్కడే టిఫిన్‌, భోజనం చేశాను. పెద్ద ఖర్చు లేకుండానే కడుపు నింపుకొన్నాను. నాకు వచ్చిన కూలి డబ్బులను మొదటిసారి పూర్తిగా ఇంటి దగ్గర ఇచ్చాను’’

- మొల్లి అప్పారావు,

పోలీసుస్టేషన్‌ సెంటర్‌, పిఠాపురం

Updated Date - Aug 17 , 2024 | 05:47 AM