Share News

Chandrababu Naidu: రామోజీరావు అక్షర శిఖరం.. ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి

ABN , Publish Date - Jun 27 , 2024 | 06:59 PM

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో..

Chandrababu Naidu: రామోజీరావు అక్షర శిఖరం.. ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి
Chandrababu Naidu

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని సూచించారు. ఒకే ఒక ఎన్టీఆర్‌.. ఒకే ఒక రామోజీరావు ఉంటారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన అని కొనియాడారు.


మీడియాకు అందించిన కృష్టికి గానూ రామోజీరావుకు అనేక అవార్డులు వచ్చాయని.. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఆయన నంబర్ వన్‌గా ఎదిగారని సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నీతి, నిజాయతీకి రామోజీరావు ప్రతిరూపమని.. ఏ పనిచేసినా ప్రజాహితం కోరుకునేవారని చెప్పారు. మార్గదర్శి స్థాపించి 62 ఏళ్లు దాటిందని.. ఎన్నో ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించాలని చూశాయని, అయినా ఖాతాదారులందరూ ఆయన పక్షాణ నిలిచారని అన్నారు. ఎందరో నటీనటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చిన ఆయన.. కొవిడ్ సమయంలోనూ ప్రజలకు అండగా ఉన్నారన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.


హైదరాబాద్‌ అభివృద్ధిలోనూ ఆయన పాత్ర ఎంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచ సినిమాల్లోనే ఒక చరిత్ర అని.. హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు ఆ ఫిల్మ్ సిటీని చూడకుండా వెళ్లరని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు అని.. పనిచేస్తూ చనిపోవాలని ఆయన కోరారని.. చివరి రోజుల్లో అదే జరిగిందని చెప్పారు. వ్యాపారం, సినీ, సేవ, పత్రికా రంగాల్లో ఆయనకు ఆయనే సాటి అని.. తెలుగు జాతి అంటే రామోజీరావుని ఎనలేని ఆప్యాయత అని తెలిపారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారని.. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన సమయంలో ఒకేసారి ఏడు ఛానల్స్‌ను ప్రారంభించారన్నారు.


మీడియాను పెట్టుకుని.. విశ్వసనీయతకు విలువనిచ్చారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. భయం అనేది తెలియకుండా ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి అని పొగిడారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు అని.. అటువంటి వ్యక్తి సంస్మరణ సభ చేయడం తన అదృష్టమని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ తరహాలోనే రామోజీరావుకు అన్ని విధాలా గుర్తింపు వచ్చే కార్యక్రమాలు చేపడతామన్నారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం, విశాఖలో రామోజీ చిత్రనగరి ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పోరాటం చేస్తున్నామని, అలాగే రామోజీరావుకు కూడా బారతరత్న ఇవ్వాలని పోరాటం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 06:59 PM