Share News

వంచన వైసీపీదే!

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:01 AM

ఒక పార్టీ కార్యకర్తల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేయవచ్చా? అందులోనూ ఎన్నికల సమయంలో అలా చేయొచ్చా? చేస్తే...

వంచన వైసీపీదే!

వలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే

వలంటీర్లను పింఛను పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడానికి ముందే... చాలాచోట్ల వాళ్ల చేత వైసీపీ నేతలు రాజీనామా చేయించారు.

అంటే... ఆయా వార్డుల్లో అవ్వా తాతలకు

పెన్షన్‌ అందకూడదనే అలా చేశారా?

ఎన్నికల ముందు రెండు నెలలపాటు వలంటీర్లను పూర్తిగా రాజకీయ అవసరాలకే వాడుకోవాలని.. వారితో రాజీనామాలు చేయించాలని వైసీపీ ఎప్పుడో నిర్ణయించుకుంది.

అంటే.. ఈ రెండు నెలలపాటు వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదన్నది వైసీపీ నిర్ణయమే కదా! చేయాల్సిందంతా తెరవెనుక చేసేసి.. ఇప్పుడు ఈసీ జారీ చేసిన ఆదేశాలను విపక్షాలపై బురదజల్లేందుకు వాడుకుంటున్నారు.

నాడు సాఫీగా..

సంక్షేమ పథకాలు, సామాజిక పెన్షన్లను జగన్‌ కొత్తగా ప్రవేశ పెట్టలేదు. ఎప్పటి నుంచో ఇవి అమలవుతున్నాయి. సామాజిక పెన్షన్‌ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. రూ.75 ఉన్న పెన్షన్‌ వైఎస్‌ హయాంలో రూ.200లకు చేరింది. దానిని చంద్రబాబు ఒకేసారి ఐదురెట్లు పెంచి వెయ్యి చేశారు. ఆ తర్వాత రూ.2వేలకు పెంచారు. అవ్వా తాతలకు ప్రతి నెలా సాఫీగా పెన్షన్ల పంపిణీ సాగిపోయేది.

సచివాలయాల సిబ్బంది కదిలితే..

రాష్ట్ర వ్యాప్తంగా 15వేల గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ఒక్కో సచివాలయంలో 8 నుంచి 14 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంటే... సుమారు 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. పెద్ద పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపితే 1.62 లక్షల మంది అందుబాటులో ఉంటారు. వీరంతా రంగంలోకి దిగితే... కేవలం రెండు రోజుల్లోనే అవ్వా తాతలకు ఇంటింటికీ వెళ్లి పింఛను అందించవచ్చు.

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను జగన్‌ సర్కారు విప్లవాత్మకంగా చెప్పుకొంటోంది. మరి... ఎన్నికల సమయంలో రెండు నెలలు సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లను ఇంటికీ పంపిణీ చేయలేరా? అది కూడా చేయలేనప్పుడు... అన్ని గొప్పలు ఎందుకు?

వారిని సొంత కార్యకర్తల్లా వాడుకున్న పార్టీ

‘వైసీపీకి బ్రాండ్‌ అంబాసిడర్లు’ అని చెప్పిన జగన్‌

ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి

రాజీనామాలు చేసేయాలని ఎప్పుడో ఆదేశాలు

అవ్వా తాతలు కాదు.. అధికారమే ముఖ్యం

ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’

తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు

విపక్షాలపై విషం చిమ్మి పోవాలని సూచనలు

1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు

వారిచేత ఇంటింటికీ పెన్షన్‌ ఇప్పించలేరా?

మీరు చెప్పిన మాటలే ఇవి...

‘‘మా జెండాను అజెండాగా తీసుకొని త్రికరణ శుద్ధితో పని చేస్తున్నందుకు బహుమతిగా వలంటీర్లకు పురస్కారాలు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 2.60లక్షల మంది వలంటీర్ల సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని చూస్తే ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. రాబోయే రెండు నెలలు వలంటీర్లు చేసే యుద్ధం పైనే మా ప్రభుత్వ సౌధం నిలబడుతుంది. ప్రతీ వలంటీర్‌ తన క్లస్టర్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు ఎన్నికల్లో మా పార్టీ కోసం నిలిచేలా చూడాలి. వలంటీర్లు వైసీపీకి బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలి.’’

- సీఎం జగన్‌ (ఫిబ్రవరి 15న వలంటీర్లకు వందనం సభలో)

ఇప్పుడు చెప్పండి.. మీ పార్టీ బ్రాండ్‌ అంబాసిడర్లతో ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాలను అమలు చేయొచ్చా?

ఎన్నికల ముందు రెండు నెలలు పూర్తిగా వైసీపీకే పని చేయాలంటూ వలంటీర్లను వైసీపీ

ఆదేశించిన వైనంపై ఫిబ్రవరి 10వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ప్రత్యేక కథనం.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒక పార్టీ కార్యకర్తల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేయవచ్చా? అందులోనూ ఎన్నికల సమయంలో అలా చేయొచ్చా? చేస్తే... ఎలక్షన్‌ కమిషన్‌ మౌనంగా ఉండగలదా? వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేయడం నేరం, ఘోరమైతే దానికి అధికార పార్టీ నేతలే కారణమని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే... వలంటీర్ల నియామకం నుంచి నేటిదాకా ఎప్పుడూ వారిని ప్రజలకు సేవచేసే వారిగా చూడలేదు. తమ సొంత పార్టీ కార్యకర్తల్లాగానే వైసీపీ భావించింది. ఎమ్మెల్యేల నుంచి సీఎం దాకా... అందరిదీ ఒకే మాట! ‘వలంటీర్లు మా వాళ్లు. మా పార్టీ కార్యకర్తలు!’ అనే చెబుతున్నారు. ఇక ఎన్నికల షెడ్యూలుకు ముందే వలంటీర్లను విచ్చలవిడిగా తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే... ఎన్నికల ప్రక్రియకు, పింఛను పంపిణీ వంటి కార్యక్రమాలకు వలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అది పాపమైతే... ఆ పాపానికి కారణం వైసీపీనే!

రాజీనామాలు చేయిస్తున్నారు కదా!

సార్వత్రిక ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర, ప్రమేయాన్ని ఎన్నికల కమిషన్‌ ప్రశ్నిస్తుందని... అడ్డుకుంటుందని వైసీపీకి ముందే తెలుసు. వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని అటు ఈసీ, హైకోర్టు స్పష్టం చేశాయి. దీంతో.. వైసీపీ ముందుగానే ‘రాజీనామా’ల డ్రామాలు మొదలుపెట్టింది. ‘‘ఈ రెండు నెలలు మీరు పూర్తిగా మా కోసమే పని చేయాలి. ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే రాజీనామాలు చేసేయండి. మీకు నెలనెలా ఇచ్చే ఐదువేలకు రెండు మూడు రెట్లు మేమే ఇస్తాం’’ అని చెప్పారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో... చాలాచోట్ల వాళ్లు రాజీనామాలు చేయడం ప్రారంభించారు. ఇక... తాజా పరిణామాల నేపథ్యంలో పేదల పెన్షన్‌ పంపిణీకి తమను దూరం చేయడానికి విపక్షాలే కారణమని నిందలు వేస్తూ రాజీనామాలు చేసేయాలని వలంటీర్లందరికీ వాట్సప్‌ మెసేజ్‌లు పంపించారు. సోమవారం మూకుమ్మడి రాజీనామాలు కూడా మొదలయ్యాయి. విపక్షాలపై విషం చిమ్ముతూ వారి ఫోన్ల నుంచి తమ పరిధిలోని లబ్ధిదారులకు వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు.

రూ.4వేల పెన్షన్‌పై ‘కుట్ర’?

పెన్షన్‌ అంటేగుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీనే. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎన్టీఆర్‌దే. ఆయన రూ.75ల పెన్షన్‌ మంజూరు చేశారు. అది... వైఎస్‌ హయాంలో రూ.200కు చేరింది. చంద్రబాబు దానిని తొలుత వెయ్యికి, తర్వాత రూ.2వేలకు పెంచారు. వికలాంగులకు రూ.3 వేల పెన్షన్‌ మంజూరు చేశారు. కానీ... వైసీపీ సామాజిక పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పి ఆ తర్వాత దశలవారీగా ఐదేళ్లకు రూ.3 వేలు చేసింది. మళ్లీ చంద్రబాబు పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇవ్వడంతో వైసీపీ నేతలకు గుబులు పుట్టుకొచ్చింది. చంద్రబాబు పెన్షన్‌ పెంచుతామన్న హామీని సామాజిక పెన్షన్‌దారులకు చేరకుండా చంద్రబాబుపై ద్వేషం పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Updated Date - Apr 02 , 2024 | 05:01 AM