Share News

అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:41 PM

జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టడంతో పాటు కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.

అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

నేర సమీక్షలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 28: జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టడంతో పాటు కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారుల నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి పరిష్కరించాలన్నారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని రికవరీ శాతాన్ని పెంచాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యక్రమాలను కట్టడి చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్‌ల పరిధిలో పలు కేసులను సమీక్షించి తీవ్ర నేరాలతో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలు, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు, ప్రస్తుతం కోర్టులో ట్రయల్‌ ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత సీడీ ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. తీవ్ర నేరాల కేసుల్లోని వారిపై నిరంతర నిఘా ఉంచి యాక్టివ్‌గా ఉన్న వారిని బైండోవర్‌ చేయాలని సూచించారు. హత్య, రేప్‌, ప్రాపర్టీ, గంజాయి తదితర గ్రేవ్‌ కేసుల్లో దర్యాప్తు, నిందతుల అరెస్టులపై సర్కిల్‌ వారీగా పోలీసు అధికారులను ఆరా తీసి అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి పరిష్కరించాలని తెలిపారు. తరచుగా దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌ వంటి నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత ఎస్‌డీపీవోలు ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులను పెంచి నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. పోక్సో కేసులకు సంబంధించిన నిందితులపై కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పెండింగ్‌ ఉండరాదని, ఎస్‌డీపీవోఓలు ప్రతి వారంలో ఒకరోజు తమ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోక్సో కేసుల స్థితిగతులపై సమీక్ష చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహన తనిఖీలు చేపట్టి చలానాలు విధిస్తూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చేయాలని, రాత్రి గస్తీ పెంచి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను ఓపికగా విని చట్ట పరిధిలో న్యాయం చేయాలని, ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:41 PM