ఏసీబీ వలలో ఏసీపీ!
ABN , Publish Date - May 22 , 2024 | 05:20 AM
ఏసీబీ వలకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది! ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో..

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు.. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు
తెలంగాణలో 11 చోట్ల.. ఏపీలోని మూడు ప్రాంతాల్లో..
ఏసీపీ, ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు
రూ.37.50 లక్షల నగదు.. 60 తులాల బంగారం సీజ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో విలువైన ఆస్తులున్నట్టు గుర్తింపు
17 డాక్యుమెంట్ల స్వాధీనం.. విలువ రూ. 3.46 కోట్లు
మార్కెట్ విలువ రూ.25 కోట్లకు పైగానే అని అంచనా
విచారణ అనంతరం నేడు కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్
1500 కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో విచారణాధికారి
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): ఏసీబీ వలకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది! ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. హైదరాబాద్ కమిషనరేట్ సీసీఎ్సలో ఏసీపీ (టీమ్-3)గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అశోక్నగర్లోని ఆయన ఇంటితో పాటు.. ఆయన సంబంధీకుల ఇల్లు సహా.. తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో మూడు చోట్ల (విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెం, అనకాపల్లి జిల్లా రోలుగుంట, చోడవరం).. కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా ప్రీ లాంచ్ పేరుతో జరిగిన రూ.1500 కోట్ల మోసం కేసులో కీలక విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర తెలిపారు. ఇప్పటిదాకా నిర్వహించిన సోదాల్లో రూ.37.5 లక్షల నగదు..
60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఘట్కేసర్లో 5 చోట్ల, శామీర్ పేట, కూకట్పల్లి, మల్కాజిగిరిలో ఒక్కొక్కచోట, వైజాగ్, చోడవరంలో ఏడు చోట్ల, అశోక్నగర్లో ఏడుచోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 3.46 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.25 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమామహేశ్వరరావు పేరిట ఉన్న రెండు లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని భావిస్తున్నారు. కాగా.. అధికారులు స్వాధీనం చేసుకున్న ఒక డైరీలో సందీప్ అనే పేరు రాసి ఉన్నట్టు సమాచారం. అది పోలీస్ అధికారి పేరేనా అని విలేకరులు ప్రశ్నించగా.. దానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదని, విచారణలో తెలుస్తుందని ఏసీబీ జేడీ పేర్కొన్నారు. హైదరాబాద్లో సోదాలు ముగిసిన అనంతరం ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామన్నారు. సీసీఎ్సకు వస్తున్న ఆర్థిక మోసాల కేసుల్లో లంచాలు తీసుకున్నట్టు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయని జేడీ తెలిపారు.