Water Transfer: మల్లన్నసాగర్లోకి గోదావరి జలాలు
ABN , Publish Date - Aug 27 , 2024 | 05:09 AM
మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాల ఎత్తిపోతలను సోమవారం ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు.

రెండో విడత ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం
సెప్టెంబరు 1 వరకు కొనసాగింపు
తొగుట, ఆగస్టు 26: మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాల ఎత్తిపోతలను సోమవారం ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. సెప్టెంబరు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మల్లన్నసాగర్ డీఈ చెన్ను శ్రీనివాస్ తెలిపారు. యాసంగికి నీరందించేందుకు రిజర్వాయర్లో 12 టీఎంసీల పైచిలుకు నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అందుకనుగుణంగానే ఎల్లంపల్లి నుంచి వచ్చే వరదను మిడ్మానేరు మీదుగా అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకసాగర్ ద్వారా మల్లన్నసాగర్లోకి రెండో విడత నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం 10.30టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి మల్లన్నసాగర్లో నిల్వ చేయడం వల్ల కొండపోచమ్మ రిజర్వాయర్తో పాటు, దుబ్బాక ప్రధాన కాలువ, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 95 చెరువులు, కుంటలు, చెక్డ్యాంలను నింపనున్నారు. మొత్తంగా 1 లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరందించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.