National Health Mission: ఏపీకి రూ.259 కోట్ల అదనపు నిధులివ్వండి
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:07 AM
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రానికి అదనంగా ₹259 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాలకు రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రూ.800 కోట్ల మేరకు పునఃకేటాయింపులు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరిన నేపథ్యంలో, వీటిలో ఎన్హెచ్ఎం కింద ఏపీకి రూ.109 కోట్లు, పెర్ఫామెన్స్ ఇన్సెంటివ్ కింద రూ.150 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే, కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్మేఘ్వాల్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి, క్యాన్సర్ చికిత్సల విభాగానికి అదనపు సాయం అందించాలని కోరారు.