Share News

CM Chandrababu: బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:35 PM

CM Chandrababu: బీసీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్‌కు శిక్షణ ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu:  బీసీల రక్షణ కోసం  ప్రత్యేక చట్టం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
CM Chandrababu

ఏలూరు: బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామని అన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని చెప్పారు. అన్నివర్గాల కంటే మిన్నగా బీసీవర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇవాళ(శుక్రవారం) ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..

అగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పాడిరైతు నక్కనబోయిన కోటయ్య ఇంటికి చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆదాయ, ఇతర సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రజావేదికకు వెళ్లే మార్గంలో ఒక బార్బర్ షాపు వద్ద ఆగారు. షాపు యజమాని బత్తుల జగన్నాధంతో మాట్లాడారు. ఆయన సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ఆధునిక ఎక్విప్‌మెంట్, పరికరాల కిట్‌ను జగన్నాధంకు సీఎం చంద్రబాబు అందజేశారు.


సివిల్స్‌కు ప్రత్యేక శిక్షణ..

ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్‌కు శిక్షణ ఇస్తామని మాటిచ్చారు. ప్రతీ ఏడాది రూ.1000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకోవడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఆయన జయంతిని వాడవాడలా చేస్తున్నామంటే, ఆయన స్పూర్తి ఎంతో తెలుస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం జ్యోతిరావు పూలే పోరాడారని ఉద్ఘాటించారు. మన రాష్ట్రంలో మహిళల చదువు ఆవశ్యకతను గుర్తించి మహిళా యూనివర్సిటీని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.


బీసీలకు న్యాయం చేశాం...

మూఢ నమ్మకాలపై జ్యోతిరావు పూలే రాజీలేని పోరాటం, ఉద్యమాలు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ వచ్చేంతవరకు బలహీన వర్గాలకు న్యాయం జరుగలేదని అన్నారు. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీనేనని తెలిపారు. టీడీపీకి వెన్నెముక బలహీన వర్గాలు.. అలాంటి వారిని పూర్తిగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేలు గౌరవ వేతనం ఇస్తున్నామని ప్రకటించారు. బీసీల రిజర్వేషన్లను 26 నుంచి 34 శాతం పెంచడానికి చర్యలు చేపట్టామని అన్నారు. బీసీల రక్షణకు చట్టం రూపొందించడానికి ఒక కమిటీని వేశామని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే చట్టం తీసుకువస్తామని తెలిపారు. నూజివీడును పూర్తిగా అభివృద్ధి చేసేందుకు మంత్రి పార్థసారథికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అప్పులు చేసి అవినీతికి పాల్పడితే ఆ సమాజం మనుగడ సాగదని చెప్పారు. అన్ని చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు.


అప్పులు అడగాలంటే ఆంక్షలు..

అప్పులు అడగాలంటే ఆంక్షలు పెడుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా తానూ చేసిన అభివృద్ధే కనిపిస్తోందని తెలిపారు. ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు పెట్టాను.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు తానే పెట్టాను..పొదుపు సంఘాలు తానే ప్రారంభించానని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని ఉద్ఘాటించారు. రేపో ఎల్లుండో తల్లికి వందనం ఇస్తున్నామని.. ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో సంతాన రేటు 1:1.5 రేషియాలో ఉందన్నారు. 2035 నాటికి ఇలాగే జనాభా తగ్గిపోతుందని చెప్పారు. అందుకే సంతాన రేటు రెండుకు పెరగాలని అన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే పూర్తి చేస్తానని మాటిచ్చారు. మే నెల నుంచి రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తే, రాష్ట్రం రూ.14 వేలు ఇస్తుందని... అది మూడు విడతలగా ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఆడపిల్లలను విమర్శిస్తే ఊరుకోను..

అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు..తనను బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు చెప్పారు. అది గౌరవసభ కాదు, కౌరవ సభ అని అప్పుడే చెప్పా.. సీఎంగా అడుగు పెడతానని చెప్పానని.. అలాగే అసెంబ్లీకి వచ్చానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఆడపిల్లల క్యారెక్టర్‌ను హననం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో దారుణంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అన్నారని.. తప్పులు చేసే వారిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం వెళ్లి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంతకుముందు వైసీపీ హయాంలో తనను కూడా రాష్ట్రంలో తిరుగనివ్వలేదని చెప్పారు. ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగనిస్తుంటే, రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు. పీ4 విధానంతో అందరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డబ్బులు, సంపద అనేది అందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదిగా ఉండాలని తెలిపారు. ఒకరివద్దే సంపద ఉండిపోకూడదని.. మరొకరు డబ్భులు లేకుండా, చదువు లేకుండా ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన

ఫోటోషూట్లలోనే ఇదో కొత్త తరహా..

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 02:13 PM