మౌలిక సదుపాయాల కల్పనలో యాజమాన్యం వైఫల్యం
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:38 AM
అమలాపురం ఆర్టీసీ డిపోలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో యాజమాన్యం ఘోరంగా వైఫల్యం చెందిందని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు కె.నాగరాజు ఆరోపించారు

అమలాపురం రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అమలాపురం ఆర్టీసీ డిపోలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో యాజమాన్యం ఘోరంగా వైఫల్యం చెందిందని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు కె.నాగరాజు ఆరోపించారు. వాటర్ ప్లాంటును మరమ్మతులు చేయించి వేసవిలో కార్మికులు, ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో 27వ రోజు ఆదివారం డ్రైవర్లపై వేధింపులు మానుకోవాలని గేట్ మీటింగ్ నిర్వహించారు. వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.గణపతిరావు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను సైతం యాజమాన్యం పట్టించుకోవడంలేదని విమర్శించారు. డిపోలో 1/2019 సర్క్యులర్ను అమలు చేయడంతో పాటు అక్రమంగా సస్పెన్షన్కు గురైన బీఎస్ నారాయణను విధుల్లోకి తీసుకోవాలని, డ్రైవర్ కేజీ రావుపై వేధింపులు మానుకోవాలని నినాదాలు చేశారు. వర్కర్స్ యూనియన్ జిల్లా ఉప కార్యదర్శి కె.రంగప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుందని వివరించారు. కార్మికులు 21 రోజులుగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిపో అధ్యక్షుడు ఆర్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. డిపో ఎదుట ఎన్ఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో ఎల్ఎస్ బాబు, పీవీ రత్నం, వీఎల్ఎన్ రావు, ఎంఆర్ కృష్ణ, పీవీవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. పలువురు సంఘీభావం తెలిపారు.