Pithapuram Tension: పోటాపోటీ నినాదాలు.. పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:47 PM
Pithapuram Tension: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

కాకినాడ, ఏప్రిల్ 5: పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (MLC Konidela Nagababu) పర్యటనలో టీడీపీ, జనసేన కార్యకర్తలు (TDP Vs Janasena) పోటాపోటీ బల ప్రదర్శనతో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగబాబు వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు జైవర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. అంతేకాకుండా ఒకరునొకరు నెట్టుకున్న పరిస్థితి. అయితే నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వనం లేకపోవడంతో ఈ రగడ చెలరేగినట్లు తెలుస్తోంది.
గడిచిన రెండు రోజులుగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా నాగబాబు పదవీ బాధ్యతలు చేపట్టాక నిన్న (శుక్రవారం) తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ హోదాలో పర్యటించారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలందరూ జై పవన్ అంటూ నినాదాలు చేశారు. ఇరుపార్టీలు తమ నేత గురించి పొగుడుతూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అయితే రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పిఠాపురంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు భారీ బందోబస్తుతో నాగాబాబు రాగా.. అదే సమయంలో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఇరువురు కూడా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. జై పవన్ అంటూ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు కొందరు టీడీపీ శ్రేణుల దగ్గరగా వచ్చి నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్సీగా నాగబాబు పిఠాపురంలో వచ్చిన సందర్భంలో టీడీపీ ఇన్చార్జ్ వర్మను ఆహ్వానించలేదని టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అంతేకాకుండా ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం సృష్టించాయి. పిఠాపురంలో పవన్ గెలుపుకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్ని రేపాయి. అయితే పిఠాపురం కార్యక్రమాలకు అందరికీ సమాచారం అందించామని.. అయితే వాళ్లు రాకపోయినా బీజేపీ, టీడీపీ నేతలు వచ్చారని జనసేన నేతలు చెబుతున్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News