Andhra Pradesh OBC Reservations: ఆ ఐదు కులాలను ఓబీసీల్లో చేర్చండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:57 AM
ఆంధ్రప్రదేశ్లోని శిష్టకరణం, కళింగ వైశ్య, సొండి, తూర్పు కాపు, అర్వల కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నేతలు కోరారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఎంపీలతో పాటు మంత్రులు సమావేశమయ్యారు

కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు రాష్ట్ర నేతల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్లోని శిష్టకరణం, కళింగ వైశ్య, సొండి, తూర్పు కాపు, అర్వల కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలి. ఆమేరకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) ఇప్పటికే సిఫారసు చేసింది’ అని రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. గురువారం పార్లమెంటు భవనంలోని సమావేశ గదిలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్వర్యంలో ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, కె.లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్, ఐదు కులాలకు చెందిన సుమారు 80 మంది నేతలు సుధీర్ఘంగా భేటీ అయ్యారు. శిష్టకరణం, కళింగ వైశ్య, సొండి, తూర్పు కాపు, అర్వల కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేసేలా సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించవలసిందిగా కోరారు.