Share News

అమ్మవారికి కొబ్బరి కాయల సమర్పణ

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:55 AM

శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.

అమ్మవారికి కొబ్బరి కాయల సమర్పణ
కొబ్బరికాయల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది

శ్రీశైలం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 13న కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరి కాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమతో పూజాధికాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు.

శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. గ్రామదేవత అంకాలమ్మకు విశేష పూజలు నిర్వహించారు. నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా దేవస్థానం శుక్రవారం సాయంత్రం నందికొట్కూరుకు చెందిన సాయి నృత్యకళాశాల బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - Mar 08 , 2025 | 12:55 AM