Maoist Leader Chalapati :మావోయిస్టు నేత చలపతి అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:31 AM
ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అంత్యక్రియలు ఆయన అత్తగారి గ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో విప్లవ అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి.

అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో నిర్వహణ
ప్రజాసంఘ నాయకుల నివాళి
పలాస/పలాస రూరల్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అంత్యక్రియలు ఆయన అత్తగారి గ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో విప్లవ అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి. ఇటీవల ఛత్తీస్గఢ్ - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటరులో చలపతి సహా 16మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. బొడ్డపాడుతో చలపతికి ఉద్యమ బంధం ఉంది. సెరీ కల్చర్ ఉద్యోగిగా విజయనగరం వచ్చి అక్కడే నక్సలిజానికి ఆకర్షితుడై చలపతి ఉద్యమబాట పట్టారు. ఆయన ఉద్యమ ప్రస్థానం బొడ్డపాడులోనే మొదలైంది. ఈ ప్రాంతంలో సుఽధ అని ఆయనను పిలుస్తారు. ఆయన మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇక్కడకు చేరుకుంది. బొడ్డపాడు అమరవీరుల స్మారకమందిరం వద్ద ఉంచిన ఆయన మృతదేహం వద్ద ప్రజాసంఘాల నాయకులు, కళాకారులు నివాళులు అర్పించారు. అనంతరం ఊరేగింపుగా చలపతి మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున స్థానికులతోపాటు అమరుల బంధుమిత్రుల సంఘం, పౌరహక్కులసంఘం, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సహచరి అరుణ... బాటలోనే..
చలపతి భార్య పోతనపల్లి రుక్మిణి అలియాస్ అరుణది బొడ్డపాడు. ఆమె 18 ఏళ్లకే ఉద్యమంలో తుపాకీ పట్టారు. ఆ తర్వాత ఏడేళ్లకు చలపతితో వివాహం అయింది. వీరికి పిల్లలు లేరు. రుక్మిణి తల్లి సాయమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన తమ్ముళ్ల ఇంటివద్ద ఉంటోంది. ఆమెకు రుక్మిణి ఒక్కరే కుమార్తె. ఇప్పుడు అల్లుడు కూడా చనిపోవడం ఆమెను కుంగదీసింది. రుక్మిణి మరణానంతరం చలపతి ఉద్యమంలోనే విశాఖకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. కాగా, చలపతి అంత్యక్రియలు ఆయన స్వ గ్రామంలో నిర్వహించాల్సి ఉంది. అయితే, ఛత్తీస్గఢ్నుంచి మృతదేహాన్ని చిత్తూరుకు తరలించడం కష్టంగా మారింది. దీంతో అంత్యక్రియల కోసం బొడ్డపాడును ప్రజాసంఘాలు ఎంపిక చేశాయి. తన అంత్యక్రియలు బొడ్డపాడులోనే చేయాలని చలపతి అనేవారని స్థానికులు గుర్తుచేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News and Telugu News