sachivalayam: సచివాలయాల ప్రక్షాళన
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:44 PM
Public administration సచివాలయాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి.. గ్రేడ్-4 పంచాయతీల్లో 72 మందిని నియమించింది. ఇక సచివాలయల్లో ఉన్న 11 మంది ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజించి. రెండేసి సచివాలయాలను ఒక్క క్లస్టర్గా పరిగణించి.. సిబ్బందిని సర్దుబాటు చేయనుంది.

జిల్లాలో 360 క్లస్టర్ల ఏర్పాటుకు కసరత్తు
టెక్నికల్, నాన్ టెక్నికల్గా సిబ్బంది విభజన
జనాభా ప్రాతిపదికన సర్దుబాటు
మిగిలిన వారిని ఇతర శాఖలకు కేటాయింపు
ఈనెల 25 నాటికి కొలిక్కిరానున్న ప్రక్రియ
నరసన్నపేట/ టెక్కలి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): సచివాలయాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి.. గ్రేడ్-4 పంచాయతీల్లో 72 మందిని నియమించింది. ఇక సచివాలయల్లో ఉన్న 11 మంది ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజించి. రెండేసి సచివాలయాలను ఒక్క క్లస్టర్గా పరిగణించి.. సిబ్బందిని సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు జనాభా అధారంగా సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించేందుకు పంచాయితీరాజ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఈవోపీఆర్డీలు జనాభా ప్రతిపాదికన లెక్కలను సేకరించి జిల్లా అధికారులకు సమాచారం అందజేశారు. జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాలు 732 ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయ లేదా ఉద్యానశాఖ అసిస్టెంట్, మహిళా పోలీసు, సర్వేయర్, వీఆర్వో ఇలా సగటున 11 మంది ఉద్యోగులు ఉండాలి. ఈ మేరకు జిల్లాలోని సచివాలయాల్లో 8,052 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయలేదు. టెక్నికల్, నాన్ టెక్నికల్ కేడర్కు చెందిన ఉద్యోగులు 6,456 మంది మాత్రమే ఉన్నారు. కొన్ని సచివాలయాల్లో పదిమందికిపైగా సిబ్బంది ఉండగా, అత్యధిక సచివాలయాల్లో సగం కన్నా తక్కువ మంది ఉన్నారు. కొన్నిచోట్ల ఇద్దరు.. ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నా.. చాలా మందికి సరైన పని ఉండడం లేదనే విమర్శలున్నాయి. తక్కువ మంది సిబ్బంది ఉన్న చోట పనిభారం అధికంగా ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్ది సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం జనాభా ఆధారంగా ఉద్యోగులను సర్దుబాటు చేయనుంది. 3,500 మంది.. అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు ఎనిమిది మంది సిబ్బందిని కేటాయించనుంది. 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే ఏడుగురు, 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు ఆరుగురు వంతున ఉద్యోగులను కొనసాగించనుంది. ఇంజనీరింగ్, వ్యవసాయశాఖల్లో టెక్నికల్ సిబ్బందిని రెండు సచివాలయాలకు ఒకరిచొప్పున సర్దుబాటు చేస్తారు. జనాభా ప్రాతిపదికన సచివాలయాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసిన తర్వాత ఇంకా మిగిలిన ఉన్న ఉద్యోగులను సంబందిత శాఖలకు కేటాయిస్తారు. జిల్లాలో 360 క్లస్టర్లుగా విభజించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 25 నాటికి ఉద్యోగులను సర్దుబాటు చేసి.. ఉగాది నుంచి క్లస్టర్ వ్యవస్థ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కేటగిరీలు ఇలా..
సచివాలయ సిబ్బందిని బహుళార్థక, సాంకేతిక, ఆకాంక్షల కార్యనిర్వాహకులుగా విభజిస్తారు. బహుళార్థక కార్యనిర్వాహకులుగా పంచాయతీ కార్యదర్శిని వార్డు ఎడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా, డిజిటల్ అసిస్టెంట్ను వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రోసెసింగ్ సెక్రటరీగా, వెల్ఫేర్ అసిస్టెంట్ను వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా, గ్రామ మహిళా పోలీస్ను వార్డు మహిళా పోలీస్గా మార్చనున్నారు. సాంకేతిక కార్యనిర్వాహకులుగా వీఆర్వోని వార్డు రెవెన్యూ సెక్రటరీగా, ఏఎన్ఎంను వార్డు హెల్త్ సెక్రటరీగా, సర్వే అసిస్టెంట్ను వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీగా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ను వార్డు ఎమినిటీస్ సెక్రటరీగా, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ విభాగాలకు సంబంధించి వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలుగా, ఎనర్జీ అసిస్టెంట్ను వార్డు ఎనర్జీ అసిస్టెంట్గా మార్చనున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ కూడా జరిగేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ విషయమై జిల్లా నోడల్ ఆఫీసర్గా నియామకమైన పి.కిరణ్కుమార్ వద్ద ప్రస్తావించగా ‘క్లస్టర్ మ్యాపింగ్ కార్యక్రమం జరుగుతోంది. మొబైల్యాప్ ద్వారా సర్వే చేస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు రేషనలైజేషన్ ప్రక్రియ కూడా దోహదపడుతుంద’ని తెలిపారు.
సచివాలయాల్లో సిబ్బంది ఇలా..
=================================
మండలం/మునిసిపాలిటీ సచివాలయాలు సిబ్బంది
=================================
బూర్జ 16 153
ఎల్.ఎన్.పేట 12 117
కోటబొమ్మాళి 27 255
గార 26 239
పలాస 16 148
జి.సిగడాం 21 202
రణస్థలం 28 246
పోలాకి 23 222
జలుమూరు 24 238
నరసన్నపేట 24 226
ఎచ్చెర్ల 28 239
టెక్కలి 20 187
లావేరు 23 216
మెళియాపుట్టి 21 193
నందిగాం 22 200
సంతబొమ్మాళి 20 181
హిరమండలం 13 121
పాతపట్నం 18 176
సోంపేట 24 180
కొత్తూరు 27 235
మందస 29 212
వజ్రపుకొత్తూరు 27 209
కంచిలి 22 155
పొందూరు 27 244
శ్రీకాకుళం రూరల్ 28 249
ఇచ్ఛాపురం (రూరల్) 16 108
ఆమదాలవలస(రూరల్) 19 184
సరుబుజ్జిలి 14 131
సారవకోట 20 202
కవిటి 22 155
శ్రీకాకుళం (అర్బన్) 38 344
ఇచ్ఛాపురం (అర్బన్) 10 60
పలాస-కాశీబుగ్గ (అర్బన్) 16 128
ఆమదాలవలస (అర్బన్) 11 101
---------------------------------------------------------------------------
మొత్తం 732 6,456
---------------------------------------------------