ఆటో డ్రైవర్ నిజాయితీ
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:40 PM
ఆటో డ్రైవర్ ఒకరు నిజాయితీని చాటుకున్నారు.ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన బంగారు వస్తువులను పోలీసుల ద్వారా వారికి అప్పగించి మన్ననలు పొందారు.

ప్రయాణికులు మరిచిపోయిన బంగారు నగల బ్యాగును తిరిగి అప్పగించిన వైనం
నక్కపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ ఒకరు నిజాయితీని చాటుకున్నారు.ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన బంగారు వస్తువులను పోలీసుల ద్వారా వారికి అప్పగించి మన్ననలు పొందారు. వివరాల్లోకి వెళితే..
నక్కపల్లి టీచర్స్ కాలనీలో నివాసం వుంటున్న చెందిన బిక్కవోలు వెంకట కృష్ణ, శిరీష దంపతులు రెండు రోజుల కిందట విజయవాడ వెళ్లారు. సోమవారం సాయంత్రం బస్సులో నక్కపల్లికి తిరిగి వచ్చారు. లగేజీ కూడా వుండడంతో బస్టాండ్ వద్ద ఆటో మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నారు. సామాను తీసుకునే క్రమంలో బ్యాగు ఒకటి ఆటోలో మరిచిపోయారు. ఈ విషయాన్ని డ్రైవర్ కూడా గమనించలేదు. కొంతసేపటి తరువాత బంగారు ఆభరణాలు వున్న బ్యాగు కనిపించలేదు. సోమవారం రాత్రి పోలీసు స్టేషన్కు వెళ్లి ఎనిమిది తులాల బంగారు నగలు వున్న బ్యాగును ఆటోలో మరిచిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తునికి చెందిన ఆటో డ్రైవర్ గెడ్డమూరి అంజి మంగళవారం సాయంత్రం శిరీష ఇంటికి వచ్చి, ఆటోలో మరిచిపోయిన బ్యాగును వారికి చూపించారు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పింది. దీంతో పోలీసుల సమక్షంలోనే బ్యాగును అందజేస్తానని ఆటో డ్రైవర్ చెప్పడంతో అంతా కలిసి స్టేషన్కు వెళ్లారు. సీఐ కుమారస్వామి సమక్షంలో శిరీషకు బ్యాగు అందించారు. ఆటో డ్రైవర్ అంజిని సీఐ అభినందించారు.