విజయవంతంగా స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:18 AM
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని విశాఖపట్నంలో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.

తొలిరోజు 50 రిజిస్ట్రేషన్లు పూర్తి
విశాఖపట్నం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని విశాఖపట్నంలో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ఒక్కరోజే 50 స్లాట్ల ద్వారా 50 రిజిస్ట్రేషన్లు చేశారు. సూపర్ బజార్ ప్రాంగణంలోని ఆర్ఓలో ఈ కార్యక్రమాన్ని డీజీ బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక్కడి ఆర్ఓలో జాయింట్-1, జాయింట్-2 ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండడంతో రోజుకు 39 స్లాట్లు చొప్పున 78 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా శుక్రవారం 50 రిజిసే్ట్రషన్లు చేసినట్టు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు తెలిపారు. వచ్చిన వారికి కొత్త విధానం కోసం చెప్పి, హెల్ప్ డెస్క్ ద్వారా స్లాట్లు బుక్ చేయించి, సీరియల్ వారీగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు వివరించారు. వచ్చిన వారు కూడా ఈ విధానం బాగుందని, ఇకపై సూచించిన సమయానికే వస్తామని, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొనడం గమనార్హం.