వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:40 AM
విశాఖపట్నంలో వెల్నెస్ సెంటర్లకు మంచి డిమాండ్ ఉందని, చాలామంది అనువైన భూములు కావాలంటూ పర్యాటక శాఖను సంప్రతిస్తున్నారని జిల్లా పర్యాటక శాఖాధికారి (డీటీఓ) సుధాసాగర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

‘పతంజలి’ ప్రతినిధులు పలు ప్రాంతాలు చూసి వెళ్లారు
మేర్లిన్ కే, శాంక్టన్కు నోటీసులు ఇచ్చాం
పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులు
‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా పర్యాటక శాఖాధికారి సుధా సాగర్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో వెల్నెస్ సెంటర్లకు మంచి డిమాండ్ ఉందని, చాలామంది అనువైన భూములు కావాలంటూ పర్యాటక శాఖను సంప్రతిస్తున్నారని జిల్లా పర్యాటక శాఖాధికారి (డీటీఓ) సుధాసాగర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఆయన ఇటీవల డీటీఓగా బాధ్యతలు చేపట్టారు.
ప్రశ్న: వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న సంస్థలేవి?
జవాబు: పతంజలి గ్రూపునకు చెందిన ప్రతినిధులు ఇటీవల పలు ప్రాంతాలను చూసి వెళ్లారు. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
ప్ర: పర్యాటక శాఖ బీచ్ రెస్టారెంట్లను అద్దెకు ఇస్తే వారు పక్కన భూములు ఆక్రమించడంపై తీసుకున్న చర్యలు?
జ: తొట్లకొండలో శాంక్టన్కు, భీమిలిలో మేర్లిన్ కే’కు అదనపు నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరిస్తూ నోటీసులిచ్చాం.
ప్ర: అన్నవరంలో ఒబెరాయ్, మే ఫెయిర్ ప్రాజెక్టుల పరిస్థితి?
జ: ఒబెరాయ్ గ్రూపు ఎర్త్ వర్క్ ప్రారంభించింది. మే ఫెయిర్ భూములకు ప్రధాన మార్గం నుంచి యాక్సెస్ లేకపోవడంతో దానికి సంబంధించి పనులు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది.
ప్ర: పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులు ఎప్పటి నుంచి ఇస్తారు?
జ: రెండు రోజుల క్రితమే సింగిల్ విండోకు సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తులను ప్రాసెస్ చేస్తాం.
ప్ర: భీమిలి మండలంలో పర్యాటక శాఖకు భూములిచ్చారా?
జ: శారదాపీఠం నుంచి వెనక్కి తీసుకున్న 15 ఎకరాలిస్తే పర్యాటక ప్రాజెక్టులు చేపడతామని ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరారు.
ప్ర: బంగ్లాదేశ్ నౌకను రెస్టారెంట్గా మార్చేలా అనుమతులు వచ్చాయా?
జ: అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఇటీవల విజయవాడలో సీఆర్జెడ్ సమావేశం జరిగింది. త్వరలోనే వారు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.