Satyavardhan: విజయవాడ కోర్టుకు సత్యవర్థన్.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం..
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:11 PM
Satyavardhan: గన్నవరం టీడీపీ కార్యాలయంపై అల్లరి మూకల దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. అందుకోసం అతడిని సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని కోర్టుకు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుట అతడు ఇచ్చే వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేయనున్నారు.

విజయవాడ, ఫిబ్రవరి 17: గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు సత్యవర్థన్ను విజయవాడ కోర్టుకు పటమట పోలీసులు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుట సత్యవర్థన్ 164 స్టేట్మెంట్ను పోలీసులు వీడియో రికార్డు చేయనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులకు సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు వాపస్ తీసుకోవాలంటూ సత్యవర్థన్కు వల్లభనేని వంశీ నుంచి బెదిరింపుల రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సత్యవర్థన్ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో సత్యవర్థన్ కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 161 కింద అతడి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే 164 కింద మరోసారి అతడి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయనున్నారు. అందుకోసం సోమవారం మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో సత్యవర్థన్ను విజయవాడ కోర్టుకు తీసుకు వచ్చారు. అయితే అతడిని మీడియా కంట కనబడనీయకుండా.. కోర్టు వెనుక భాగం నుంచి లోపలికి తీసుకు వచ్చారు. అలాగే అతడి ముఖానికి మాస్క్ సైతం తగిలించారు. మరికొద్ది సేపటిలో మేజిస్ట్రేట్ ఎదుట అతడు వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.
2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ప్రధాన సాక్షిగా సత్యవర్థన్ ఉన్నారు. నాడు అతడు ఇచ్చిన ఫిర్యాదే అత్యంత కీలకంగా మారింది. ఆ క్రమంలో అతడి కేసు వల్లే.. నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ సత్యవర్థన్ను వల్లభనేని వంశీ అనుచరులు భయపెట్టారు. అంతేకాకుండా.. ఈ కేసులో సాక్ష్యాలను సైతం తారుమారు చేసేందుకు వల్లభనేని వంశీతోపాటు అతడి అనుచరులు ప్రయత్నించారనే విమర్శలు ఉన్నాయి.
Also Read: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్: ఆర్టీసీ ఎండీ
అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు పక్కాగా సేకరించారు. అందులోభాగంగా ఇటీవల వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందుకు సంబంధించి.. ఇప్పటి వరకు 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు సైతం కొనసాగుతోన్నాయి.
Also Read: టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?
మరోవైపు ఈ కేసు వెనక్కి తీసుకోవాలంటూ సత్యవర్థన్తోపాటు అతడి ఇంట్లోని వారిని వంశీ బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. అందుకు సంబంధించిన ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీతోపాటు అతడి అనుచరులు.. సత్యవర్థన్తో ఎలా వ్యవహరించారనే అంశాలను అతడి నుంచి పోలీసులు పక్కాగా రాబ్టటారు. ఆ క్రమంలో వారు భయపెట్టడం, ప్రలోభపెట్టడం వంటి అంశాలను సైతం సత్యవర్థన్తో పోలీసులు ప్రస్తావించారు.
దీంతో సత్యవర్థన్ ఇచ్చే స్టేట్మెంట్ అత్యంత కీలకంగా మారనుంది. అయితే ఈ కేసులో నేరం చేయడం కంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం మరింత పెద్ద నేరం కానుంది. ఈ నేపథ్యంలో వంశీకి ఉచ్చు గట్టిగా బిగుస్తూనట్లు తెలుస్తోంది. అదీకాక ఇప్పటికే వంశీపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News