IPL 2025, RCB vs GT: స్వంత మైదానంలో బెంగళూరుకు షాక్.. గుజరాత్ విజయం
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:59 PM
మొదటి రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్వంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో తడబడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో బెంగళూరుకు తొలి షాకిచ్చింది.

మొదటి రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్వంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో తడబడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో బెంగళూరుకు తొలి షాకిచ్చింది. బెంగళూరు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో గుజరాత్కు ఇది రెండో విజయం కాగా, బెంగళూరుకు ఇదే తొలి ఓటమి.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ఆర్సీబీకి బ్యాటింగ్ ఇచ్చాడు. షాట్ సెలక్షన్లో లోపం కారణంగా బెంగళూరు బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. అయితే లివింగ్ స్టన్ (54) సమయోచితంగా ఆడి హాఫ్ సెంచరీ చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. జితేష్ శర్మ (33), టిమ్ డేవిడ్ (32) కీలక పరుగులు చేశారు. కోహ్లీ (7), దవ్దత్ పడిక్కళ్ (4), సాల్ట్ (14), రజిత్ పటీదార్ (12) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు తీశాడు. అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ తీశారు.
170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ (14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అయితే జాస్ బట్లర్ (73) భారీ బౌండరీలు బాదుతూ మ్యాచ్ను గుజరాత్ వైపు తిప్పేశాడు. సాయి సుదర్శన్ (49) కూడా సమయోచితంగా రాణించాడు. వీరిద్దరూ చక్కగా ఆడడంతో మ్యాచ్ బెంగళూరకు దూరమైంది. చివర్లో రూథర్ఫోర్డ్ (30) కూడా రాణించాడు. దీంతో బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హాజెల్వుడ్ చెరో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..