మా సంగతేంటి?
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:00 AM
ఉమ్మడి జిల్లా కాంగ్రె్సలో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాబినెట్ విస్తరణ అనంతరం పెండింగ్లో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులకు నియామకాలు చేపడతామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించినప్పటికీ, క్యాబినెట్ విస్తరణ రోజురోజుకూ జాప్యమవుతోంది.

నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ
క్యాబినెట్ విస్తరణ జాప్యంతో వీటిపై ప్రభావం
ముఖ్యనేతలపై ఒత్తిడి తెస్తున్న ఆశావహులు
నేతల వద్ద ముమ్మర ప్రయత్నాలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): ఉమ్మడి జిల్లా కాంగ్రె్సలో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాబినెట్ విస్తరణ అనంతరం పెండింగ్లో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులకు నియామకాలు చేపడతామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించినప్పటికీ, క్యాబినెట్ విస్తరణ రోజురోజుకూ జాప్యమవుతోంది. దీంతో నామినేటెడ్ పదవులు కోరుతున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఏప్రిల్ మొదటివారంలోనే ఉంటుందని భావించినా, రకరకాల కారణాలతో అది వాయిదా పడింది. దీంతో క్యాబినెట్ విస్తరణతో సంబంధం లేకుండా నామినేటెడ్ పదవుల పంపకాలు చేపట్టాలని ఆశావహులు మంత్రులు, ముఖ్యనేతలపై ఒత్తి డి తెస్తున్నారు. పదేళ్లపాటు అధికారంలో లేకు న్నా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, గడచిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి చెమటోడ్చిన నాయకులతోపాటు, అధిష్ఠా నం సూచనలమేరకు ఎమ్మెల్యే టిక్కెట్లకు పోటీ నుంచి తప్పుకున్న వారు ఇకనైనా తమకు ఇచ్చి న హామీ మేరకు తక్షణం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని గాడ్ఫాదర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
నామినేటెడ్లో ఛాన్స్ దక్కింది కొందరికే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్కు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందే తొలిదశలో జరిగిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమే్షరెడ్డి (సూర్యాపేట), మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బండ్రు శోభారాణి (ఆలేరు), రాష్ట్ర దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ముత్తినేని వీర య్య (హుజూర్నగర్) నియమితులయ్యారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాద వ్, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్గా గుత్తా అమిత్రెడ్డి నియమితులయ్యారు.
గాడ్ఫాదర్లపై ఒత్తిడి తెస్తున్న ఆశావహులు
క్యాబినెట్ విస్తరణ, తత్సమాన పదవుల నియామకాలు పూర్తయిన వెంటనే నామినేటెడ్ పదవులూ భర్తీ చేస్తామని అంతా భావిస్తున్న తరుణంలో విస్తరణ వాయిదా పడింది. దీంతో తమ సంగతేంటని, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు గాడ్ఫాదర్లపై ఒత్తిడి తెస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, డాక్టర్ కుడుదుల నగేశ్లు వారికి కీలకమైన పదవి వస్తుందనే విశ్వాసంలో ఉన్నారు. కీలకమైన యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్త ల మండలి చైర్మన్, బోర్డు సభ్యుల పదవులతో పాటు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జిల్లా స్థాయిల్లో ఉండే గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మహిళా ఆర్గనైజర్ పదవులు, దేవాలయాల కమిటీల చైర్మన్ పదవులు, అర్బన్డెవల్పమెంట్ అఽథార్టీల చైర్మన్ పదవులు, మార్కెట్ కమి టీ చైర్మన్ల వంటి పదవులను ఆశించే నాయకులంతా పదవులిప్పించాలని మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఫ బీసీ కోటాలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలా్షనేత కార్పొరేషన్ పదవిని ఆశిస్తున్నారు. ఫ నల్లగొండ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపి, క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చిన గుమ్ముల మోహన్రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి వస్తుందని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగంగా ప్రకటించినా, ఇప్పటివరకు ఆయనకు పదవి ఖరారు కాలేదు. ఫ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన ముఖ్య అనుచరుడు జడ్పీమాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డికి సైతం రాష్ట్ర కార్పొరేషన్లలో కీలక పదవి ఖాయమైందని చెబుతున్నా నియామకం జరగకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. ఫ నకిరేకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కె ట్ ఆశించి భంగపడ్డ పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యకు త్వరలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమని చెబుతున్నారు. మరోవైపు దైద రవీందర్, అన్నెపర్తి జ్ఞానసుందర్ కూడా కార్పొరేషన్ పదవులకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అండెం సంజీవరెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో ఐడీసీ సంస్థ డైరెక్టర్లుగా పనిచేసిన సాముల శివారెడ్డి (హుజూర్నగర్), కంచర్ల యాదగిరిరెడ్డి (తుంగతుర్తి) కూడా కార్పొరేషన్ పదవులొస్తాయనే నమ్మకంలో ఉన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్గా పనిచేసిన ఎరగాని నాగన్న, పీసీసీ సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు కూడా కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోదాడ నియోజకవర్గం నుంచి సీనియర్నేతలు ముత్తవరపు పాండురంగారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి సైతం పరిస్థితులు అనుకూలిస్తే కీలకపదవులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్కుమార్, పంజాల రామాంజనేయులుగౌడ్, పల్లె శ్రీనివా్సగౌడ్, లింగంయాదవ్ కూడా కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జూలూరి ధనలక్ష్మి మహిళా కోటాలో తనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మొత్తానికి ఎవరికి ఏ పదవి దక్కుతుందో వేచి చూడాల్సిందే.