Seethakka: ఉపాధి కూలీలకు బీఆర్ఎస్ పైసా ఇవ్వలే
ABN , Publish Date - Jan 20 , 2025 | 04:49 AM
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉపాధి కూలీలకు పైసా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వారికి రూ.12వేల సాయం ఇచ్చేందుకు చర్యలు చేపడితే.

మేం రూ.12 వేలు ఇస్తామంటే ఓర్వడం లేదు: సీతక్క
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉపాధి కూలీలకు పైసా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వారికి రూ.12వేల సాయం ఇచ్చేందుకు చర్యలు చేపడితే.. దానిపై తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకారం అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాలకు రెండు విడతల్లో రూ.12వేలు ఇస్తామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పథకం పట్ల దేశమంతా ఆసక్తి చూపుతుంటే.. తెలంగాణలోని కొన్ని రాజకీయ శక్తులు తప్పుడు గణంకాలతో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీఆర్ఎ్సను ఉద్దేశించి విమర్శించారు. కూలీలకు ఆర్థిక చేయూతనందిస్తుంటే ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతుందని ధ్వజమెత్తారు. భూమి లేని ఉపాధి కూలీ కుటుంబాలు 6 లక్షలకుపైగా ఉంటాయని అంచనాలు ఉన్నాయని, వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు.