Comedian Aliని అలా సర్దేశారు!
ABN , First Publish Date - 2022-10-28T03:05:29+05:30 IST
హాస్య నటుడు మహమ్మద్ అలీని సీఎం జగన్ ఎలకా్ట్రనిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ పదవిలో అలీ రెండేళ్లపాటు కొనసాగుతారు. రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ

ఎలకా్ట్రనిక్ మీడియా సలహాదారుగా నియామకం
రాజ్యసభ, మైనారిటీ కమిషన్ పదవులు హుష్
ఇప్పటికే మీడియాకు ఇద్దరు సలహాదారులు
ఇప్పుడు మూడో సలహాదారుగా అలీ
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): హాస్య నటుడు మహమ్మద్ అలీని సీఎం జగన్ ఎలకా్ట్రనిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ పదవిలో అలీ రెండేళ్లపాటు కొనసాగుతారు. రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాష్ట్రం నుంచి ఎంపిక చేసే అభ్యర్థుల రేసులో అలీ పేరు ప్రముఖంగా వినిపించింది. సినీ సమస్యలు చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్ తదితరులతోపాటు అలీ కూడా సీఎంను కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘త్వరలోనే మంచి రోజు వస్తుంది’ అని తనకు సీఎం చెప్పారన్నారు. దీంతో... రాజ్యసభ స్థానం ఆయనకు ఖరారైనట్లే అని అంతా భావించారు. కానీ... అది నిజం కాలేదు. ఆ తర్వాత రెండు రోజులకు... అలీని మైనారిటీ కమిషన్ చైర్మన్గా నియమిస్తారంటూ ప్రభుత్వ వర్గాలు మళ్లీ లీకులు ఇచ్చాయి. అలీకి ఆ పదవి కూడా లభించలేదు. చివరికి..ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు.. మూడో కృష్ణుడు తరహాలో ఇప్పటికే ఇద్దరు మీడియా సలహాదారులుండగా, మరో సలహాదారుగా అలీని నియమించారు.
ఇంకెందరు వస్తారో...
మీడియా సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.... జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ను నియమించారు. వీరి రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో మరో రెండేళ్లు పొడిగించారు. ఇలా ఇద్దరు మీడియా సలహాదారులు ఉండగానే ‘ఎలకా్ట్రనిక్ మీడియా సలహాదారు’ అనే మరోహోదా సృష్టించి... అందులో అలీని సర్దేశారు.