Share News

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

ABN , Publish Date - Sep 28 , 2024 | 09:34 PM

మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు. ఏబీఎన్‌లో ప్రసారమయ్యే వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంతే ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఆయుధాలు ఇస్తున్నారని అన్నారు. పాలనాధినేతగా రేవంత్ కాస్త దూకుడు తగ్గించుకోవాలని.. మాటతీరు సౌమ్యంగా ఉండాలన్నారు.

విపక్ష నేత సీఎం చంద్రబాబే టార్గెట్‌గా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన పనులు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయని.. వైసీపీ ఓటమిలో మాటతీరు ప్రభావం కూడా ఎంతో ఉందన్నారు. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హైడ్రా, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై బుల్డోజర్ల వంటి కార్యక్రమాలపై రాధాకృష్ణ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడైనా ప్రజామోదంగానే ఉండాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు అందుకు కారకులైన మాజీ సీఎం కేసీఆర్‌ను ఇరిక్కించొచ్చన్నారు. కానీ.. ప్రజలు అవినీతి ప్రాతిపాదికన ఓట్లేయట్లేదని.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జగన్ అని పేర్కొన్నారు.


రుణమాఫీ పేరుతో పౌరుషానికి..

ప్రభుత్వ ఆర్థిక వనరులు, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పౌరుషానికి వెళ్లి కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని ఆర్కే అన్నారు. తద్వారా విపక్షబీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ఆయుధం సమకూర్చినట్లైందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చిందని వాటిని అమలు చేయడం కత్తిమీద సామేనని ఆర్కే అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు హైడ్రా, మూసీ, ఇటు రైతు రుణమాఫీ తదితర పనులతో స్వల్ప ప్రజా వ్యతిరేకత మొదలైందని.. అది పెరగకముందే సీఎం రేవంత్ అప్రమత్తం కావాలని సూచించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని.. కానీ రేవంత్ విషయంలో అది జరగట్లేదన్నారు. మంత్రులు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు.


బీఆర్ఎస్‌కు అందివచ్చిన అవకాశం..

కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలు బీఆర్ఎస్‌కు అందివచ్చిన అవకాశంలా మారాయని ఆర్కే అన్నారు. "బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే కాంగ్రెస్‌ది కూల్చివేతల ప్రభుత్వం అంటున్నారు. ఈ వాదన బలపడకముందే కాంగ్రెస్ అలర్ట్ కావాలి. బీఆర్ఎస్ ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవరూ అనుకోలేదు. ఎన్నికల వరకు ఊపుమీదున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్, హరీశ్‌లకు దూకుడు తగ్గించుకోవాలని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చే ఏడాది వరకు వేటు పడేలా చేయాలని వారితో ఆయన అన్నట్లు తెలిసింది. ఈలోపు ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చే బాధ్యతను కేటీఆర్, హరీశ్ రావులకు అప్పగించారు" అని ఆర్కే తన వీకెండ్ కామెంట్‌లో పేర్కొన్నారు.


తెలంగాణ బాపునే కాదనుకున్నారు..

"ప్రజలకు నచ్చకపోతే ఎవరినైనా గద్దె దింపుతారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. తెలంగాణ బాపు‌ కేసీఆర్‌నే ప్రజలు ఓడించారంటే.. అలాంటిది కాంగ్రెస్ సర్కార్ ఎంత అప్రమత్తంగా పని చేయాలి. ఇకనైనా రేవంత్ దూకుడు తగ్గిస్తారో లేదో వేచి చూడాలి" అంటూ ఆర్కే అన్నారు.

Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 28 , 2024 | 10:02 PM