48 కోడిగుడ్లు@ రూ.48 వేలు!
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:50 AM
48 కోడిగుడ్ల కోసం ఆశపడితే రూ.48 వేలు పోగొట్టుకున్న ఉదంతం ఇది. ఆన్లైన్ మోసాల్లో ఇదో సరికొత్త మోసం.

బెంగళూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): 48 కోడిగుడ్ల కోసం ఆశపడితే రూ.48 వేలు పోగొట్టుకున్న ఉదంతం ఇది. ఆన్లైన్ మోసాల్లో ఇదో సరికొత్త మోసం. కేవలం రూ.49 చెల్లిస్తే 48 కోడిగుడ్లు ఇస్తామంటూ ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లింక్ను క్లిక్ చేసిన కాసేపటికే బ్యాంకు ఖాతా నుంచి రూ.48,199 గల్లంతయ్యాయి. బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వసంతనగర్కు చెందిన మహిళ మెయిల్కు ఈనెల 17న ఆన్లైన్ కంపెనీ నుంచి సందేశం వచ్చింది. అందులో రూ.49కే 48 గుడ్లు వస్తాయంటూ ఒక ఆఫర్ కనిపించింది. డెలివరీ అడ్రసుతోపాటు మొబైల్ నంబరు, ఇతర వివరాలను ఇవ్వాలని, పేమెంట్ ఆప్షన్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలని అందులో సూచించారు. అందుకు అనుగుణంగానే క్రెడిట్కార్డు వివరాలు పొందుపరచి ఓటీపీ నంబర్ నమోదు చేసి రూ.49 చెల్లించారు. కొన్ని క్షణాలలోనే మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,199 డ్రా అయినట్లు సందేశం వచ్చింది. వెంటనే తేరుకున్న ఆమె బ్యాంకుకు సమాచారం ఇచ్చి క్రెడిట్కార్డు లావాదేవీలను వెంటనే నిలిపివేయించారు. ఆ వెంటనే హైగ్రౌండ్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.