Share News

సాత్విక్‌ జోడీ కొట్టాలి పసిడి!

ABN , Publish Date - Jul 18 , 2024 | 05:03 AM

గత మూడు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలను అందిస్తున్న విభాగం బ్యాడ్మింటన్‌. లండన్‌ క్రీడల్లో సైనా నెహ్వాల్‌ కాంస్యం అందుకోగా.. ‘రియో’లో రజతంతో మెరిసిన పీవీ సింధు.. టోక్యోలో కంచు మోత మోగించింది. ఈసారి పారిస్‌ క్రీడల్లో డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టిపై భారీ అంచనాలున్నాయి...

సాత్విక్‌ జోడీ కొట్టాలి పసిడి!

పారిస్‌ ఒలింపిక్స్‌ 8 రోజుల్లో

  • డార్క్‌హార్స్‌గా లక్ష్యసేన్‌

  • హ్యాట్రిక్‌ పతక వేటలో సింధు

గత మూడు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలను అందిస్తున్న విభాగం బ్యాడ్మింటన్‌. లండన్‌ క్రీడల్లో సైనా నెహ్వాల్‌ కాంస్యం అందుకోగా.. ‘రియో’లో రజతంతో మెరిసిన పీవీ సింధు.. టోక్యోలో కంచు మోత మోగించింది. ఈసారి పారిస్‌ క్రీడల్లో డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టిపై భారీ అంచనాలున్నాయి. ఇక, సింధు హ్యాట్రిక్‌ పతకంతో మెరవాలనుకుంటోంది.

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించింది. గత రెండు ఈవెంట్లలో సింధు రజతకాంస్యాలు దక్కించుకోగా.. 2012లో సైనా ఈ విభాగంలో తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో గత మూడు మెగా ఈవెంట్లలో పతకాలనందిస్తున్న మన షటర్లు.. ఇదే ఒరవడిని కొనసాగించాలని అభిమానులు కోరుకొంటున్నారు. పారిస్‌ క్రీడల్లో సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, లక్ష్యసేన్‌ సింగిల్స్‌లో బరిలోకి దిగనుండగా.. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌, అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జోడీలు ఆడనున్నాయి.


అద్భుతాలు జరిగితేనే..

కామన్వెల్త్‌ క్రీడల్లో గాయపడిన సింధు.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ఫామ్‌ను అందిపుచ్చుకోలేక పోయింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా.. గత కొంత కాలంగా ఆడుతున్న ప్రముఖ ఈవెంట్లలో ఒక్కటి కూడా నెగ్గలేదు. ఇక, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌ బరిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో వీరి ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయితే, తమదైన రోజు ఎంతటి గొప్ప ఆటగాడికైనా ఓటమి రుచిచూపగల సత్తా వీరికి ఉంది. వీరిలో లక్ష్యసేన్‌ను డార్క్‌హార్స్‌గా నిపుణులు పరిగణిస్తున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని జంట చివరి నిమిషంలో ఒలింపిక్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. క్రాస్టోతో కలసి అశ్విని ఈ మధ్య కాలంలోనే ఆడడం ఆరంభించగా.. ఒక్క మేజర్‌ టోర్నీ కూడా గెలిచిన సందర్భాలు లేవు.

)


ఎంతో తేడా...

బ్యాడ్మింటన్‌లో ఏదైనా పతక ఆశలు ఉన్నాయంటే.. అది పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ నుంచే. టోక్యో ఒలింపిక్స్‌లో సాత్విక్‌ ద్వయం గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. అయితే, ఆ తర్వాతి నుంచి వారి కెరీర్‌ టాప్‌ గేర్‌లో దూసుకుపోయింది. 2022లో భారత్‌ తొలిసారి ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ గెలవడంలో సాయిరాజ్‌ జోడీ కీలకపాత్ర పోషించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకంతో సాత్విక్‌, చిరాగ్‌ ప్రకంపనలు సృష్టించారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌తో తొలి సూపర్‌-750 సిరీ్‌స టైటిల్‌ను సొంతం చేసుకొన్న సాత్విక్‌ జంట.. స్విస్‌ ఓపెన్‌, ఆసియా చాంపియన్‌సిషిప్‌లో కూడా సత్తాచాటింది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మకమైన ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌-1000 సిరీస్‌ నెగ్గిన సాయిరాజ్‌-షెట్టి ద్వయం.. వరల్డ్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకొన్న భారత తొలి డబుల్స్‌ జోడీగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తూ నాలుగు టోర్నీల్లో ఫైనల్‌ చేరింది. మిగతా ఆటగాళ్లపై అంతంతమాత్రమే అంచనాలున్న నేపథ్యంలో.. పతక భారం మొత్తం సాత్విక్‌-చిరాగ్‌ జోడీపైనే.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం

Updated Date - Jul 18 , 2024 | 05:03 AM