Share News

Delhi: పట్టు వదలని ఢిల్లీ పోలీసులు!

ABN , Publish Date - May 10 , 2024 | 06:40 AM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించి, వీడియో వైరల్‌ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు... నిందితుల అరెస్టుపై పట్టు వదలడం లేదు. ఈ కేసు విషయమై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Delhi: పట్టు వదలని ఢిల్లీ పోలీసులు!

  • అమిత్‌ షా ఫేక్‌ వీడియో వ్యవహారంలో

  • మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయాలని పిటిషన్‌

  • లంచ్‌మోషన్‌కు నిరాకరించిన హైకోర్టు

  • దిగువ కోర్టులో పీటీ వారెంట్‌ వేసుకోవచ్చని వ్యాఖ్య

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించి, వీడియో వైరల్‌ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు... నిందితుల అరెస్టుపై పట్టు వదలడం లేదు. ఈ కేసు విషయమై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. కింది కోర్టులో పీటీ వారెంట్‌ వేసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, టీపీసీసీ సోషల్‌ మీడియా కార్యకర్త మన్నె సతీశ్‌సహా పలువురికి బెయిల్‌ వచ్చింది.


అయితే, ఢిల్లీ పోలీసులు సైతం తమను అరెస్ట్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఒకే రకమైన ఆరోపణలతో నమోదైన కేసులో ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం 3న ఆదేశాలు జారీ చేసింది. సదరు ఆదేశాలను ఎత్తేయాలని, నిందితులను అదుపులోకి తీసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు తాజాగా గురువారం హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఎదుట లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా వినాల్సిన అవసరం లేదంటూ జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీసుల ముందు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు వీలుగా దిగువ కోర్టును ఆశ్రయించి.. పీటీ వారెంట్‌ దాఖలు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.


మరోవైపు.. టీపీసీసీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శులను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీచేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వెకేషన్‌ కోర్టు జడ్జి జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, మళ్లీ కార్యకర్తల తరఫున రాజకీయ పార్టీ పిటిషన్‌ వేయడమేంటని ప్రశ్నించారు. ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగితే వారే కోర్టుకు రావాలి తప్పితే పార్టీలు రావడం ఏంటని అడిగారు. ఇప్పటికే ఆదేశాలు అమలులో ఉన్నందున పిటిషన్‌ను ముగిస్తామని పేర్కొన్నారు. పిటిషనర్‌ నుంచి మరిన్ని సూచనలు తీసుకుంటామని సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి చేయడంతో విచారణను జూన్‌కు వాయిదా వేశారు.

Updated Date - May 10 , 2024 | 06:40 AM