Share News

పదేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:50 AM

ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రె్‌సతో చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ సహా ఎవరు చర్చకు వచ్చినా

పదేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం

ఖర్గే, రాహుల్‌ ఎవరొచ్చినా సరే

6గ్యారెంటీలపై రేవంత్‌ స్పందించాలి

హామీలు ఏమయ్యాయి?: కిషన్‌రెడ్డి

నేడు పార్టీ ఆఫీసులో రైతు దీక్ష

హైదరాబాద్‌/రెజిమెంటల్‌ బజార్‌/బర్కత్‌పుర, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రె్‌సతో చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ సహా ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతి, కుటుంబ రాజకీయాలతో మాత్రం తాము పోటీ పడలేమని ఎద్దేవా చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఐదేళ్ల తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ విడుదల చేసిన సంకల్ప పత్రను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500.. వృద్ధులకు రూ.4వేల పెన్షన్‌.. దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్‌ ఎప్పుడిస్తారని నిలదీశారు. రూ.5లక్షల విద్యా భరోసా కార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా, బైసాఖీ ఉత్సవాల సందర్భంగా ఆదివారం సికిందరాబాద్‌లోని గురుద్వారాలో కిషన్‌రెడ్డి పూజలు చేశారు. తాను ఏటా ఈ వేడుకలకు వస్తుంటానని.. ఎన్నికల దృష్టితో రాలేదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమాన్ని కిషన్‌రెడ్డి సోమవారం ఉదయం హిమాయత్‌నగర్‌లో ప్రారంభిస్తారు.

19న కిషన్‌రెడ్డి నామినేషన్‌

సికిందరాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్న కిషన్‌రెడ్డి 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం తన సతీమణి కావ్యతో కలిసి అంబర్‌పేట మహంకాళి, శంకరమఠం, బషీర్‌బాగ్‌ కనకదుర్గ ఆలయం, సికిందరాబాద్‌ మహంకాళి ఆలయాల్లో కిషన్‌రెడ్డి పూజలు చేస్తారు. అనంతరం ర్యాలీగా ప్యాట్నీ సెంటర్‌లోని మహబూబియా కళాశాల వరకు వెళతారు. అక్కడి నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తారు.

అవినీతి నిర్మూలనకు మోదీ గ్యారెంటీ: సంజయ్‌

ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి నిర్మూలనపై కేంద్రం కార్యాచరణ ఉండబోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ వెల్లడించారు. అవినీతి నిర్మూలనకు నిరంతర నిఘా, పటిష్ఠమైన చర్యలకు ప్రధాని మోదీ గ్యారెంటీ అని ప్రకటించారు. పేదల అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ నాయకత్వం మ్యానిఫెస్టో ప్రకటించిందని తెలిపారు.

Updated Date - Apr 15 , 2024 | 03:50 AM