Share News

Mahabubabad: కొడుకు మృతితో ఆగిన సవతి తల్లి గుండె

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:09 AM

తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.

Mahabubabad: కొడుకు మృతితో ఆగిన సవతి తల్లి గుండె

మహబూబాబాద్‌ రూరల్‌, ఆగస్టు 23 : తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ శివారు శనిగపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. రైల్వే ట్రాక్‌మెన్‌గా పనిచేసే శనిగపురానికి చెందిన మంద వెంకన్న.. భార్య స్వరూప 30 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటికే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.


మొదటి భార్య మరణించడంతో చిన్న గూడూరు మండలం జయ్యారానికి చెందిన జ్యోతి (50)ని వెంకన్న రెండో వివాహం చేసుకున్నాడు. జ్యోతి, వెంకన్నకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వరూప మొత్తం ఐదుగురు పిల్లలను ఒకేలా సాకింది. పిల్లలందరికీ పెళ్లిళ్లు కూడా జరిగాయి. వెంకన్న గత ఏడాది మరణించగా జ్యోతి ఖమ్మంలో తన కూతురు వద్ద ఉంటోంది. మరోపక్క, వెంకన్న మొదటి భార్య కుమారుడు రవి (32) శనిగపురంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే రవి మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు.


దీంతో భర్తను వదిలేసిన స్వప్న నాలుగునెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నించి మానసికంగా కుంగిపోయిన రవి అనారోగ్యానికి గురై గురువారం మరణించాడు. ఈ విషయం తెలిసి ఖమ్మం నుంచి శనిగపురానికి వచ్చిన సవతి తల్లి జ్యోతి.. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయింది. మృతదేహంపై పడి గుండెలవిసేలా ఏడుస్తుండగా గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు.

Updated Date - Aug 24 , 2024 | 04:09 AM