CM Chandrababu: ఉగాది రోజున మార్గదర్శి బంగారు కుటుంబం
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:11 AM
తెలుగు సంవత్సరాది రోజున రాష్ట్రంలో ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అమలు కానుంది, పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయడం తన లక్ష్యమని తెలిపారు

విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): తెలుగు సంవత్సరాది రోజున రాష్ట్రంలో ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పీ4 కార్యక్రమంలో భాగంగా దీన్ని అమలు చేస్తామన్నారు. దీనికి ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ అని నామకరణం చేశామన్నారు. గురువారం విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడు పూటలా తిండిలేని పేదలు ఉన్నారని, వారి జీవన ప్రమాణాలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాళ్లతోనే ఉండాలన్నది తన జీవిత ఆశయమని, పేదరికంలో ఉన్న వాళ్లను పైకి తీసుకువస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు ఫరూక్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకటరావు, పార్టీ నాయకులు ఫారూక్ షిబ్లీ, జలీల్ఖాన్, నెట్టెం రఘురాం, కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.