Kia Motors India: కియ కార్ల పరిశ్రమలో చోరీ.. 900 ఇంజిన్లు మాయం
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:02 AM
శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా మోటార్స్ ప్లాంట్ నుంచి సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. ఈ ఘటనపై ఎస్ఐటీ విచారణ చేపట్టగా, మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు చేస్తున్న సిట్
పెనుకొండ టౌన్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియలో దొంగలు పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. కియతోపాటు ఈ ప్రాంతంలో 25 అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ప్రధాన పరిశ్రమలో రోజుకు 450 కార్ల ఉత్పత్తి జరుగుతుంది. వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి. ఈ క్రమంలో దాదాపు 900 ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది. మార్చి నెలలో ఎస్పీ రత్న కియ పరిశ్రమను సందర్శించారు. ఆ సమయంలోనే ఇంజిన్ల మాయం గురించి కియ సీఈఓ, ఎండీ గ్వాంగులీ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, విచారించాలని కోరినట్లు సమాచారం. కానీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పడంతో మార్చి 19న కియ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాప్తు చేస్తోంది. దీని వెనుక గతంలో కియలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కియ పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో మార్గ మధ్యంలో చోరీ జరిగిందా లేక మరెక్కడైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..