Anantapur: సెల్ఫోన్ కొనివ్వలేదని... బాలుడి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:36 AM
సెల్ఫోన్ కొనివ్వలేదని తల్లిపై అలిగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

అనంతపురం జిల్లాలో ఘటన
యాడికి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): సెల్ఫోన్ కొనివ్వలేదని తల్లిపై అలిగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన గంజి మల్లికార్జున, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లికార్జున గతంలోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కొడుకులూ భవన నిర్మాణ పనులకు వెళుతుండగా.. తల్లి వెంకటలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు సెల్ఫోన్ కొనివ్వాలని ఇటీవల చిన్న కుమారుడు మహేంద్ర (17) తల్లిని అడిగాడు. ఇప్పుడు నీకు సెల్ఫోన్ అవసరమా అని తల్లి మందలించింది. దీంతో మహేంద్ర అలిగి, శుక్రవారం రాత్రి విషపుగుళికలు మింగాడు. ఇది గుర్తించిన తల్లి వెంకటలక్ష్మి చికిత్స నిమిత్తం కొడుకును తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించింది. చికిత్స పొందుతూ శనివారం మహేంద్ర మృతిచెందాడు. తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.