Visakhapatnam: విజయ ప్రతిధ్వని.. టైగర్ ట్రయంఫ్
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:36 AM
భారత్-అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించే ‘టైగర్ ట్రయంఫ్-2025’ సైనిక విన్యాసాలు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు కీలకంగా ఉంటాయి

తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా
విశాఖపట్నంలో ప్రారంభమైన వేడుక
13 వరకూ భారత్, అమెరికా సైనిక విన్యాసాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): భారత్, అమెరికా నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహించే ‘టైగర్ ట్రయంఫ్-2025’ సైనిక విన్యాసాలు ఈసారి విజయాన్ని ప్రతిధ్వనించేలా ఉంటాయని తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అన్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈనెల 13వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ‘టైగర్ ట్రయంఫ్-2025’ ఆరంభ కార్యక్రమాన్ని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లోని ఐఎన్ఎస్ జలాశ్వపై మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీర్ సక్సేనా మాట్లాడుతూ.. ఏటా అమెరికా, భారత్ నౌకాదళాలు నిర్వహిస్తున్న విన్యాసాల్లో ఇది నాలుగోదని వివరించారు. ఇది రెండు దేశాల మధ్య నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సంబంధాలను పెంపొందించడమే కాకుండా స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు, 8 నుంచి 12 వరకు సముద్ర విన్యాసాలు ఉంటాయన్నారు. భారత్ తరఫున యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ ఘరియల్, ఐఎన్ఎస్ శక్తి, ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని తెలిపారు. అమెరికా తరఫున యుఎస్స్ కామ్స్టాక్, యుఎస్స్ రాల్ఫ్ జాన్సన్, పీ8ఏ పోసిడాన్ విమానం, సి-130జె విమానం ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు.
అమెరికా రక్షణ వ్యవహారాల ఇన్చార్జి జోర్గాన్ కె ఆండ్రూస్ మాట్లాడుతూ.. రెండు దేశాల భాగస్వామ్యం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతానికి రక్షణపరంగా మరింత భరోసా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ సుశీల్ మీనన్, ఐఎన్ఎస్ జలాశ్వ కెప్టెన్ సౌషద్ అలీఖాన్, కామ్స్టాక్ కమాండింగ్ ఆఫీసర్ బైరన్ స్టాక్స్, రియర్ అడ్మిరల్ గ్రెగొరి న్యూకిర్క్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News