కానరాని పర్యాటక సందడి
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:33 PM
మన్యంలో పర్యాటక సందడి కానరావడం లేదు. ఆదివారం ఏజెన్సీలో పర్యాటకులు అంతగా కనిపించడం లేదు.

అంతంతమాత్రంగానే పర్యాటకులు
వెలవెలబోతున్న పర్యాటక కేంద్రాలు
పాడేరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పర్యాటక సందడి కానరావడం లేదు. ఆదివారం ఏజెన్సీలో పర్యాటకులు అంతగా కనిపించడం లేదు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండడంతోపాటు పర్యాటక సీజన్ ముగియడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగానే సందర్శించారు.
పర్యాటకులు నామమాత్రమే..
డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహారి, అరకు సిల్క్ఫాం, కొలపుట్ జలతరంగిణి పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగానే ఉన్నారు. వీకెండ్ ఆదివారం కూడా చాపరాయి జలవిహారిలో అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించారు. వారు కూడా జలవిహారిలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. చిన్నారులు ఆట స్థలంలో ఆడుతూ కుటుంబ సమేతంగా సరదాగా గడిపారు.