హిందూత్వకు ‘ఫాసిజం’ నప్పుతుందా?
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:53 AM
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 24వ మహాసభల తీర్మానం ముసాయిదాలో ‘‘కేంద్ర ప్రభుత్వం నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నది’’ అని పేర్కొనడంతో, ఫాసిజం, నయా -ఫాసిజం, నాజిజంల మీద మేధోరంగంలో..

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 24వ మహాసభల తీర్మానం ముసాయిదాలో ‘‘కేంద్ర ప్రభుత్వం నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నది’’ అని పేర్కొనడంతో, ఫాసిజం, నయా -ఫాసిజం, నాజిజంల మీద మేధోరంగంలో కొత్త చర్చ మొదలైంది. నేరుగా ‘ఫాసిస్టు’ అనకుండా ‘కొత్త ఫాసిస్టు స్వభావం’ అనడంపై కాంగ్రెస్తో పాటు సీపీఐ సైతం సీపీఎంను తప్పుపడుతున్నాయి. ఇతరులు ఛాందసం అనుకున్నా సరే భూస్వామ్య సమాజానికి తనకంటూ కొన్ని విలువలు వుంటాయి. పెట్టుబడీదారీ వ్యవస్థకు మాత్రం లాభాలే ముఖ్యం. అదే దాని సంస్కృతి, అదే దాని విలువ. లాభం వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే తాళ్ళను సైతం పెట్టుబడిదారులు అమ్మకానికి పెట్టగలరు. నిరంతరం ఉత్పత్తి పెరుగుతుండాలి, పెరిగిన ఉత్పత్తిని అమ్మడానికి నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి. విస్తరించిన మార్కెట్ డిమాండ్ను అందుకోవడానికి మళ్ళీ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి. ఎక్కడా ఆగడానికి వీల్లేదు.
ఆగితే ఖేల్ ఖతం! గతంలో సెల్ఫోన్ల మార్కెట్ను ఏలిన నోకియా, బ్లాక్బెరీ, మోటరోలా బ్రాండ్లు ఇప్పుడు ఎక్కడా? పోంటియాక్ కార్లు ఎక్కడా? యాహూ సెర్చ్ ఇంజిన్ ఎక్కడా? కింగ్ ఫిషర్ ఏర్లైన్స్, కొడాక్ కెమెరాలు, సోనీ వాక్మెన్లు ఇప్పుడు వెతికినా కనిపించవు. పరుగు ఆపేస్తే మహామహా బ్రాండ్లు కూడా అలా అంతమైపోతాయి. తమ ప్రాచుర్యం, బ్రాండ్ ఇమేజ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుందనుకుంటే పెట్టుబడిదారులు ఏ వేషమైనా వేయగలరు. ఒక దశలో అత్యంత ఆధునికులుగా, హేతువాదులుగా, మతరహితులుగా దర్శనమివ్వగలరు. జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మతం పనికివస్తుంది అనుకుంటే ఇంకో దశలో వాళ్ళే సమాజంలో ఛాందసాన్ని, మూఢనమ్మకాలను పెంచిపోషించగలరు. ఇప్పుడు భారీ పెట్టుబడిదారులు (వీరినే మనం మెగా కార్పొరేట్లు అంటున్నాం) ఇదే చేస్తున్నారు. తమ లాభాల కోసం ప్రజల్లో మతతత్త్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఓట్లను ఆకర్షించి తమ అనుకూలుర్ని ఎన్నికల్లో గెలిపించుకుని వారి ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు. మన వర్తమాన వ్యవస్థను సాంకేతికంగా ‘కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం’ అంటే గానీ తత్త్వం బోధపడదు (Corporate Communal Dictatorship – CCD). ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, దాని పాలనా తీరుని మెచ్చుకునేవారు ఉన్నట్లే నచ్చని వారూ వుంటారు. నచ్చనివారు దీన్ని ఫాసిస్ట్ అంటున్నారు. ఆ మాటను కాంగ్రెస్సూ అంటున్నది, కమ్యూనిస్టులూ అంటున్నారు. ఫాసిజం ఇటాలియన్ పదం.
అది ముస్సోలినీ నియంతృత్వాన్ని విమర్శించడానికి ఇటలీ కమ్యూనిస్టులు పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు. నిజం అదికాదు. ముస్సోలిని సగర్వంగా తనకుతానుగా పెట్టుకున్న పేరు అది. ‘ఫాసియో’ అంటే ఇటలీ భాషలో కట్టెల మోపు అని అర్థం. ఆ తరువాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారాడు. తన పాలనకు నాజీ అని పేరుపెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో ‘జాతీయ సోషలిజం’ అని అర్థం. బీజేపీ కూడా తొలి రోజుల్లో జాతిపిత గాంధేయ సోషలిజం అనేది. ఫాసిజం, నాజిజం రెండూ నియతృత్వ పాలనలే. అయినప్పటికీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. ఆరెస్సెస్ వ్యవస్థాపకులైన హెడ్గేవార్ మీద ముస్సోలినీ ప్రభావం ఉండింది. రెండవ సర్ సంఘ్ ఛాలక్ అయిన ఎంఎస్ గోల్వార్కర్ హిట్లర్ను ఎక్కువగా అభిమానించేవారు. స్వచ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో గోల్వార్కర్ రాసిన ‘We, or Our Nationhood Defined’ పుస్తకం 1935లో జర్మనీలో హిట్లర్ తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఇటలీ ఫాసిజంలో మైనారిటీ మత సమూహాలను అణచివేయాలనే అంశం లేదు; కనీసం మొదట్లో లేదు. హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టాడు, మన దేశంలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావాన్ని అభివర్ణించడానికి ఫాసిజం కన్నా నాజిజమే దగ్గరగా ఉంటుంది. ఇటలీలో ముస్సోలిని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్టు, మన దేశంలో సంఘపరివారం ‘హిందూత్వ’ అనే పేరును ఇష్టంగా పెట్టుకుంది. చాలామందికి మతానికీ, మతతత్త్వానికీ తేడా తెలియనట్లే హిందుకూ హిందూత్వకూ తేడా తెలీదు. మతం అంటే దేవుని మీద విశ్వాసం. మతతత్త్వం అంటే ఇతర మతస్తుల మీద అసహనం. మతం వ్యక్తిగతం, మతతత్త్వం రాజకీయార్థిక వ్యవహారం. అతివాద హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్ ఇటలీ ఫాసిజం నుండి ఉత్తేజాన్ని పొంది 1922లో ‘హిందూత్వ’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూత్వ అనగానే తమని నిందిస్తున్నారని సాధారణ హిందువులు అపోహపడితే తమ ఉనికికి ముప్పు వస్తుందని రాజకీయ పార్టీలు జంకుతుంటాయి. మెజారిటీ మతతత్త్వ నియంతృత్వాన్ని సంబోధించడానికి కొందరు ‘కాషాయ’, ‘బ్రాహ్మణీయ’ అనే పదాలను వాడుతున్నారు. బ్రాహ్మణులు, కాషాయాంబరధారులు అందర్నీ నియంతల జాబితాలో వేసేస్తే మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. ఇండియా కమ్యూనిస్టు పార్టీల్లో మొదటినుండీ ఒక ఇబ్బంది వుంది. మత వ్యవస్థలోనూ పీడితులు పీడకులు వుంటారని అవి గుర్తించలేదు. గుర్తిస్తే పీడితుల పక్షాన ఉంటామని ప్రకటించాల్సి ఉంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి వెళ్ళిపోతుందని వాళ్ళ భయం. మతవ్యవస్థలో పీడితుల పక్షం వహించలేవు; పీడకుల పక్షం వహిస్తామని చెప్పుకోలేవు. ఇలాంటి ఇరకాటం నుండి బయటపడడానికి మతంలో వర్గం లేదని చాలాకాలం బుకాయించాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం, లింగం అన్నింటిలోనూ వర్గం వుంటుంది. వర్గం సర్వాంతర్యామి. ప్రతిదేశంలోనూ పాలక మతం ఉన్నట్టే పాలిత మతం కూడా ఉంటుంది. నిజ జీవిత ఉత్పత్తి, పునరుత్పత్తులే చరిత్ర గమనాన్ని నిర్ణయించే అంశం అనేది మార్క్సిస్టుల అవగాహన. దీనినే పునాది అంటారు. దీనితో పాటు ఉపరితలం కూడ వుంటుంది. రెండూ విడిగా ఉండవు.
పునాది ఉపరితలాల్లో ప్రధానమైంది నిస్సందేహంగా పునాదే. దాని అర్థం ఉపరితలానికి తావులేదని కాదు. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో ఉంటూ, ఒకదాన్ని మరొకటి నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. సాంకేతిక భాషలో చెప్పాలంటే, పునాదీ ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో ఉంటాయి. గడిచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం మీద సీపీఎం అంచనా మారుతూ వచ్చింది. 2018 ఏప్రిల్ 18–22 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన సీపీ-ఎం 22వ మహాసభల్లో ‘‘నిరంకుశ హిందూత్వ సాగిస్తున్న మతతత్త్వ దాడులు ముందుకు వస్తున్న ఫాసిస్టు ధోరణులను ప్రదర్శిస్తున్నాయి’’ అని తీర్మానించారు. 2022 ఏప్రిల్ 6–10 తేదీల్లో కన్నూర్లో జరిగిన 23వ మహాసభల్లో ‘‘మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ ఫాసిస్టిక్ ఎజెండాను అమలు చేస్తున్నది’’ అని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 2-6న మధురైలో జరుగనున్న 24వ మహాసభల ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ తీవ్రతను పెంచారు. ‘‘మితవాద హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకునిపోవడానికీ, ప్రతిపక్షాలనూ, ప్రజాస్వామ్యాన్నీ అణగదొక్కడానికీ అనుసరిస్తున్న నియంతృత్వ పద్ధతులు నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా ‘ఫాసిస్టు’ అనవచ్చుగా అని కాంగ్రెస్, సీపీఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 1970ల నాటి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ‘హిట్లర్’ అని నేరుగా విమర్శించేవారు. జయప్రకాశ్ నారాయణ, అటల్బిహారీ వాజ్పాయి, జార్జ్ ఫెర్నాండెజ్, మురార్జీ దేశాయి, ఎల్కే అద్వానీ, నానీ ఫాల్కీవాల తదితరులు ఆమెను అలా విమర్శించినవారి జాబితాలో ఉన్నారు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నాటికన్నా మెరుగ్గా వుందా? ఘోరంగా వుందా? అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. రాబోయే మహాసభల్లో సీపీ-ఎం నాయకత్వం దానికి వివరంగా సమాధానం చెప్పవచ్చు.
డానీ సామాజిక విశ్లేషకులు
Read Latest AP News And Telugu News