Madras High Court: తమిళనాట ఈడీ రగడ
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:43 AM
తమిళనాడులో మద్యం విక్రయాల సంస్థ టాస్మాక్కు సంబంధించిన అవినీతి కేసు విచారణ నుంచి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్, జస్టిస్ సెంథిల్కుమార్ తప్పుకున్నారు. ఈ కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

టాస్మాక్ కేసు విచారణ నుంచి తప్పుకొన్న జడ్జిలు
చెన్నై, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తమిళనాట మద్యం విక్రయాల కోసం ఏర్పాటైన ‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్’(టాస్మాక్)కు సంబంధించిన కేసు విచారణ నుంచి ఇద్దరు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు వైదొలిగారు. చెన్నై ‘టాస్మాక్’ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తనిఖీలు పూర్తయ్యాక మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సుమారు రూ.వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. అయితే, ఈడీ చర్యల్ని సవాల్ చేస్తూ టాస్మాక్ ఎండీ సహా ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 20న న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్, జస్టిస్ సెంథిల్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే టాస్మాక్ ఉద్యోగులను గంటల తరబడి కార్యాలయంలో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను ఈడీ అధికారులు తోసిపుచ్చారు. తాము ఉద్యోగులను నిర్బంధించలేదన్నారు. మద్యం అమ్మకాల లైసెన్సు మంజూరులోనే భారీ ఎత్తున అవినీతి, కుట్ర ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఈ పిటిషన్ ధర్మాసనం ముందు విచారణకు రాగా.. తాము ఈ కేసు విచారణ నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్ రమేశ్, జస్టి్ససెంథిల్కుమార్ తెలిపారు. ‘‘టాస్మాక్ విషయంపై మేం విచారించదలుచుకోలేదు. మా అంతట మేమే తప్పుకొంటున్నాం. దీనిపై మా కారణాలు మాకున్నాయి. వేరే ధర్మాసనానికి ఈ పిటిషన్ను బదిలీ చేసేందుకు అనువుగా పిటిషన్ను సీజే ముందుంచాలి’’ అని రిజిస్ట్రీని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ