రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి..
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:46 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

ముస్తాబాద్ (గంభీరావుపేట), ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. యా సంగి పంట కొనుగోలులో భాగంగా మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్గల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి మంగళ వారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించామన్నారు. యాసంగి సీజన్లో జిల్లా పరిధిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి మహిళా సంఘాల ద్వారా 191కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 42, మెప్మా ద్వార 6, డీసీఎంఎస్ ద్వారా 1, మొత్తం 240 కొనుగోలు కేంద్రా లను ఏర్పాటుచేస్తున్న కలెక్టర్ వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించినట్టు తెలిపారు. వేసవి నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ ఉండెలా చూసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ సంచులు, ప్యాడిక్లీనర్, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు అందు బాటులో పెట్టుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణీ, డీఆర్డీవో శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో బీరయ్య తదితరులు ఉన్నారు.