నేడే పీఎస్‌ఎల్వీ-సీ53 కౌంట్‌డౌన్‌

ABN , First Publish Date - 2022-06-29T09:11:08+05:30 IST

నేడే పీఎస్‌ఎల్వీ-సీ53 కౌంట్‌డౌన్‌

నేడే పీఎస్‌ఎల్వీ-సీ53 కౌంట్‌డౌన్‌

కొనసాగుతున్న ప్రయోగ రిహార్సల్స్‌ 

శ్రీహరికోట (సూళ్లూరుపేట), జూన్‌ 28: మూడు సింగపూర్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చేందుకు సిద్ధమైన పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ ప్రయోగానికి షార్‌లో రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. షార్‌ రెండవ ప్రయోగవేదికపై రెడీగా ఉన్న రాకెట్‌కు జీరో పాయింట్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగ రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం వరకు ఈ రిహార్సల్స్‌ జరగనున్నాయి. అనంతరం మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (వాహన సంసిద్ధత సమావేశం) జరగనుంది. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైందని ప్రకటించిన తదుపరి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్నీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రయోగ కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. 25 గంటలపాటు సాగే ఈ కౌంట్‌డౌన్‌ సమయంలో రాకెట్‌లోని 2, 4 దశల మోటార్లకు ద్రవ ఇందనాన్ని, గ్యాస్‌ను నింపనున్నారు. అనంతరం రాకెట్‌లోని ఎలక్ర్టానిక్‌ పరికరాల పనితీరును పరీక్షించనున్నారు. కౌంట్‌డౌన్‌ గురువారం సాయంత్రం 6 గంటలకు జీరోకు చేరుకోగానే మూడు సింగపూర్‌ ఉపగ్రహాలతో పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగ పర్యవేక్షణ నిమిత్తం ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ బుధవారం రాత్రికి షార్‌కు చేరుకోనున్నారు. 


షార్‌లో ఐదుగురు ఉన్నతాధికారులకు కరోనా 

షార్‌లో కొవిడ్‌ కలకలం రేపుతోంది. గురువారం పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉండగా సోమవారం ఐదుగురు ఉన్నతాధికారులకు పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం. వీరిలో ఓ వైద్యురాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌కు పరిమితం చేసినట్టు తెలిసింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సందర్శకులను, మీడియాను అనుమతించాలా.. వద్దా అని ఇస్రో వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. 


Updated Date - 2022-06-29T09:11:08+05:30 IST