టీ 20 చాంపియన్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌

ABN , First Publish Date - 2022-12-09T23:34:37+05:30 IST

వాల్తేరు రైల్వే క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన సీనిర్‌ క్రికెటర్లు చిన్నరాజు, పీవీ.రామరాజు స్మారక టీ20 క్రికెట్‌ నాకౌట్‌ టోర్నీలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

టీ 20 చాంపియన్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌
విజేత జట్టుకు ట్రోఫీ అందిస్తున్న పార్థసారధి, తదితరులు

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 9: వాల్తేరు రైల్వే క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన సీనిర్‌ క్రికెటర్లు చిన్నరాజు, పీవీ.రామరాజు స్మారక టీ20 క్రికెట్‌ నాకౌట్‌ టోర్నీలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. గుడ్‌ ఫ్రెండ్స్‌ సీసీ రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో స్టీల్‌ప్లాంట్‌ నాలుగు పరుగుల తేడాతో గుడ్‌ ఫ్రెండ్స్‌ సీసీపై విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్టీల్‌ప్లాంట్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 138 పరుగులు చేసింది. హెచ్‌కే బోత్రా (41), పార్వతీ శ్రీనివాస్‌ (28) రాణించారు. గుడ్‌ ఫ్రెండ్స్‌లో హెచ్‌.రాజు మూడు, నాగార్జున రెండు నాలుగు పడగొట్టారు. ఛేదనలో గుడ్‌ ఫ్రెండ్స్‌ సీసీ 19.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటయింది. ఏకే.రాజు (45), కిశోర్‌ (21), మహ్మద్‌ ఫాజిల్‌ (22) రాణించినా ఫలితం లేకపోయింది. స్టీల్‌ప్లాంట్‌ బౌలర్లలో అనంత ప్రతాప్‌, జగదీష్‌ రెండేసి వికెట్లు తీశారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ క్రికెట్‌ మాజీ అంపైర్‌, విశాఖ జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి కె.పార్ధసారధి, సంయుక్త కార్యదర్శి జేకేఎం.రాజు ముఖ్య అతిఽథులుగా హాజరై విజేతలకు ట్రోఫీ, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వీడీసీఏ కోశాధికారి బోగేంద్రబాబు, బీసీసీఐ ప్యానల్‌ అంపైర్‌ ఎం.రమేష్‌కుమార్‌, టోర్నీ నిర్వాహక కార్యదర్శి డేవిడ్‌ సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:34:39+05:30 IST