Shahid Afridi: టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్‌లో 65 శాతం గెలిచే టీమ్ ఇదేనంటున్న షాహిద్ అఫ్రీదీ..!

ABN , First Publish Date - 2022-11-09T20:25:17+05:30 IST

టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. టీమిండియా, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య..

Shahid Afridi: టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్‌లో 65 శాతం గెలిచే టీమ్ ఇదేనంటున్న షాహిద్ అఫ్రీదీ..!

టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. టీమిండియా, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య గురువారం సెమీ ఫైనల్ మ్యాచ్ (T20 Semi Final) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి, గెలిచిన జట్టు ఫైనల్‌కు (World Cup Final) వెళ్లనుంది. దీంతో.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం (Team India) సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. ఇరు జట్లపై బలాబలాలపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు, ఏ జట్టు గెలవనుందోనన్న అంచనాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో.. టీమిండియా, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌పై పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ (Shahid Afridi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లు సమాన ప్రతిభను కనబరుస్తూ అద్భుతంగా ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాయని అఫ్రీదీ చెప్పాడు. అయితే.. తన వ్యక్తిగత అభిప్రాయమైతే.. టీమిండియాతో జరగనున్న సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టుకే 60-65 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని అఫ్రీదీ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ విభాగం, బౌలింగ్ విభాగం చాలా అద్భుతంగా ఉన్నాయని.. బౌలింగ్‌లో స్పిన్నర్లు కూడా బాగా రాణిస్తున్నారని చెప్పాడు. ఈ బిగ్ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని ఏ టీం అయితే తక్కువ తప్పులు మాత్రమే చేస్తుందో.. టీమ్ సమష్టిగా రాణిస్తుందో.. ఆ జట్టు విజయం సాధిస్తుందని అఫ్రీదీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. సెమీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. జట్టులో కీలక ఆటగాళ్లైన డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ గాయాలతో బాధపడుతున్నారు. మలాన్ అందుబాటులో లేకపోతే మాత్రం ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టేనని చెప్పక తప్పదు.

టీమిండియా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు (India vs England) అడిలైడ్‌ ఓవల్‌ (Adelaide Oval) వేదిక కానుండడం భారత్‌కు సానుకూలాంశం కానుంది. ఎందుకంటే.. టీమిండియా ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్‌ ఆడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఇక్కడి పరిస్థితులపై ఇంగ్లండ్‌ కన్నా భారత ఆటగాళ్లకే ఎక్కువ అవగాహన ఉంది. అటు బట్లర్‌ సేన ఈ టోర్నీలో బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌, పెర్త్‌, సిడ్నీలలోనే బరిలోకి దిగింది. అయితే పొట్టి ఫార్మాట్‌లో గత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఉండని విషయం తెలిసిందే. ఆ రోజున ఎవరు, ఎలా ఆధిపత్యం ప్రదర్శిస్తారనే దానిపైనే ఫైనల్‌కు వెళ్లగలమా? లేదా? అనేది నిర్ణయమవుతుంది. ఈ విషయం భారత జట్టుకు కూడా తెలుసు కాబట్టి.. జాగ్రత్తగా ఆడి తుది పోరుకు చేరాలనుకుంటోంది. ఈ ఉత్కంఠభరిత పోరులో విజేత ఎవరో తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. న్యూజిలాండ్ జట్టును ఓడించి పాకిస్థాన్ ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. ఇంగ్లండ్‌ను సెమీస్‌లో టీమిండియా ఓడిస్తే వరల్డ్ కప్ ఫైనల్‌లో దాయాదుల పోరుకు అవకాశం లేకపోలేదు.

Updated Date - 2022-11-09T20:26:06+05:30 IST