ఏఎన్యూ లా కోర్సు పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2023-02-06T00:45:59+05:30 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గతంలో ఉన్న లా కోర్సును పునరుద్ధరించాలని అందుకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని హైకోర్టు జడ్జీలు జస్టిస్ జీ రామకృష్ణప్రసాద్, జస్టిస్ డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ తెలిపారు.

పెదకాకాని, ఫిబ్రవరి 5: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గతంలో ఉన్న లా కోర్సును పునరుద్ధరించాలని అందుకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని హైకోర్టు జడ్జీలు జస్టిస్ జీ రామకృష్ణప్రసాద్, జస్టిస్ డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ తెలిపారు. ఆదివారం వర్సిటీలో లా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ జీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లా కోర్సు పూర్తి చేసిన వారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. దేశానికి అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ లాంటి మహోన్నతమైన వ్యక్తులను వర్సిటీ అందించిందన్నారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన విశ్వవిద్యాలయంలో లా కోర్సును ప్రారంభించాలని ఆకాంక్షించారు. న్యాయశాఖ ద్వారా దేశానికి, సమాజానికి ఎనలేని సేవలందించవచ్చని తెలిపారు. ఇతర వృత్తులతో పోల్చుకుంటే న్యాయవాద వృత్తిలో మానవత్వం కలిగి ఉంటుందన్నారు. సమాజంలో సమస్యల పరిష్కారానికి లా ఎంతగానో దోహదపడుతుందన్నారు. జస్టిస్ డాక్టర్ వీఆర్కే సాగర్ మాట్లాడుతూ లా కోర్సు పునః ప్రారంభంపై పూర్వ విద్యార్థుల తరపున ఓ లేఖను వీసీకి, ఉన్నత విద్యా శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. ఇతర వృత్తుల కంటే న్యాయ శాఖకు ప్రత్యేకత ఉందని, దీనిని గుర్తించుకుని న్యాయవాదులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రంరెడ్డి నాగిరెడ్డి, విశాఖపట్నం దామోదర సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ వీసీ ఆచార్య ప్రకాష్, వర్సిటీ పూర్వ వీసీ ఆచార్య హరగోపాల్రెడ్డి, ఆచార్య సుబ్రహ్మణ్యం, ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ గోచిపాతల శ్రీనివాసరావు, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్రెడ్డి, జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.