అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2023-02-28T00:30:15+05:30 IST
శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు వారి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్బాబు పిలుపునిచ్చారు.

నెల్లూరు(హరనాథపురం), ఫిబ్రవరి 27 : శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు వారి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్బాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం నెల్లూరులోని వీఆర్ పీజీ కళాశాలలో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 13న జరుగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియలో కీలక పాత్ర వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా జిల్లాలోని సీనియర్ అధికారులను నియమించామన్నారు. వీరికి రెండు విడతలుగా శిక్షణ ఇస్తారన్నారు. మొదటి విడతలో బ్యాలెట్ బాక్సుల నిర్వహణ గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తారని, రెండో విడతలో ఓటు హక్కు వినియోగించే విధానంపై తర్ఫీదు ఇస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసే విధానం గురించి స్వీప్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన పెన్ మాత్రమే వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నుడా వీసీ బాపిరెడ్డి, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఆత్మకూరు ఆర్డీవో కరుణకుమారి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవాలి
నెల్లూరు-చిత్తూరు-ప్రకాశం జిల్లాల్లో విఽధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కలెక్టర్ ఆదేశానుసారం విధిగా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని డ్వామా పీడీ వెంకట్రావు, ఏపీఎంఐపీ పీడీ టీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో కోరారు. పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల విధులకు హాజరౌతున్న సిబ్బందికి ఫారం-12ను అందచేశామని తెలిపారు. ఇంకా ఫారం-12 కావాల్సిన వారు డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ నుంచి పొందాలని కోరారు.